కరీంనగర్ : కాంగ్రెస్ను వీడి తాను టీఆర్ఎస్లో చేరుతాననే ప్రచారం అబద్దమని, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తనని స్పష్టం చేశారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన పొన్నం మాట్లాడుతూ.. పదవి ఉన్నా.. లేకున్నా.. కాంగ్రెస్ జెండా మోస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ఎవరితో చర్చలు జరుపలేదని, తనను టీఆర్ఎస్ నేతలు ఎవరూ పార్టీలోకి రావాలని అడుగలేదని, అడిగినా వెళ్లేది లేదని స్పష్టం చేశారు. కొంత మంది పనికట్టుకుని కావాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి వార్తలు రాసే ముందు తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.