30 తర్వాత తాగునీటికి కటకట

27 Jun, 2016 16:11 IST|Sakshi

రేగోడ్: తాగునీటికి మళ్లీ కటకట రాబోతోంది. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగించాలని ఆ మండల ప్రజలు కోరుతున్నారు. లేకపోతే గొంతులెండక తప్పని పరిస్థితి వారిది. వివరాలు.. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో 19 పంచాయతీలు, 25 గ్రామాలు, 16 గిరిజన తండాలు ఉన్నాయి. గతంలో బోరంచ మంజీరా పరీవాహకం నుంచి 12 గ్రామాలకు తాగునీటి సరఫరా ఉండేది. ఖాదిరాబాద్ మంజీరా పరీవాహకం నుంచి  68 గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యేది. అయితే, మంజీరాతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వం జనవరి నుంచి ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతం 30 గ్రామాలు, తండాల్లో రోజూ సుమారు వంద ట్రిప్పులు అంటే దాదాపు 5 వేల లీటర్ల నీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. దీంతో కొంత ఇబ్బందులు తీరాయి. కానీ, తాగునీటి సరఫరా గడువు ఈనెల 30తో ముగియనుంది. ఆ తరువాత తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పుష్కలంగా పడకపోవటంతో బోర్లు, బావుల్లో నీళ్లు లేవని.. ఈ పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాను కొనసాగించాలని కోరుతున్నారు. స్థానిక ఆర్‌డ బ్ల్యూఎస్ వర్క్‌ఇన్స్‌పెక్టర్ పవన్‌ను వివరణ కోరగా వర్షాలు సకాలంలో పడకపోతే ట్యాంకర్లను కొనసాగించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు