నల్లగొండ టూటౌన్: జిల్లాలో ఒలంపిక్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మేకల అభినవ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన 1వ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు క్రీడా సంఘాలు చొరవ తీసుకోవాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన క్రీడలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడా పోటీల అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్ మాట్లాడుతూ తెలంగాణలోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. క్రీడాకారులు నిత్య సాధన చేస్తే హాకీలో రాణించవచ్చన్నారు. హాకీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ మక్బూల్ అహ్మద్, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండకింది చినవెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డీ.ఇమామ్ ఖరీం, డాక్టర్ హఫీజ్ఖాన్, సలీం, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణమూర్తిగౌడ్, దూసరి కిరణ్, బి.శ్రీనివాస్, వి.రవీందర్, కె.వెంకటేశ్వర్లు యాదవ్, సీహెచ్.బ్రహ్మయ్య, దావూద్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.