– నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు
కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా భోధనను ప్రారంభిస్తోందని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు నగరంలోని స్లమ్ ఏరియాల్లో విస్త్రృతంగా పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బుధవారం స్థానిక నగరపాలకలోని కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మున్సిపల్ల పాఠశాలలను కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నామన్నరు. మెప్మాలో పనిచేసే సీఆర్పీలు, పొదుపు సంఘాల నాయకురాళ్లు మురికి వాడలు, పేదలు నివసించే ప్రాంతాలలో ఇంగ్లిషు మీడియం విద్య అమలుపై తెలియజేయాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు.