– కొమ్ము చెరువును పరిశీలించిన కలెక్టర్, జెడ్పీ చైర్మెన్
– చెరువులో ముళ్ల పొదలను తొలగించాలని ఆదేశం
ఓర్వకల్లు : జల సంరక్షణలో భాగంగా ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఓర్వకల్లు మండలం కొమ్ముచెరువుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల గంటల సమయంలో కలెక్టర్తో పాటు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కాల్వగ్రామ పరిధిలో గల కొమ్ము చెరువును సందర్శించారు. చెరువులో నీరు–చెట్టు కార్యక్రమం ద్వారా చేపట్టిన పూడిక తీత పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జల సంరక్షణ పథకంలో భాగంగా కొమ్ము చెరువులో భారీ చెక్డ్యామ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారాన్నరు. కొమ్ము చెరువులో 982, 987 సర్వే నంబర్లలో దాదాపు 162 ఎకరాలు ఆక్రమణకు గురైందని తమ దృష్టికి వచ్చిందన్నారు. సర్వే చేయించి పెగ్ మార్కులు వేసి చెరువు చుట్టూ రాళ్లతో హద్దులు వేయాలని ల్యాండ్ సర్వే అధికారులకు సూచించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లను పకడ్బందీగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కాల్వబుగ్గ రామేశ్వర చెక్డ్యామ్ను వారు పరిశీలించారు. వర్షాలు రాకముందే పూడికతీత పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్డీఓ హుసేన్సాహెబ్, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్రావు, డీఈ రఘురామిరెడ్డి, ఏఈ హసన్బాషా, తహశీల్దార్ శ్రీనాథ్ పాల్గొన్నారు.