తీరంలో ఫిషింగ్ హార్బర్?

12 Dec, 2016 15:05 IST|Sakshi
తీరంలో ఫిషింగ్ హార్బర్?

కె.మత్స్యలేశంలో పోర్టు భూముల పరిశీలన  
కె.మత్స్యలేశం (గార) : జిల్లాలోని  సముద్ర తీరాన ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను  రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ తీరాన ఎప్పటి నుంచో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వంలో ఉండటం, జిల్లాలోనే అత్యధికంగా వేట సాగే ప్రాంతం కావడంతో స్థల పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. కె.మత్స్యలేశం(పోర్టు కళింగపట్నం) తీరంలో పీపీపీ ప్రాజెక్టు పద్ధతిలో నిర్మించనున్న టెక్‌మహింద్రా రిసార్టు పక్కనే పోర్టు భూములతో పాటు బందరువానిపేట వద్ద భూమిని పరిశీలించారు. సర్వే నంబరు 221లో పోర్టు భూమి 116 ఎకరాల్లో నిర్మించే పరిస్థితి ఉంది. స్థానిక సర్పంచ్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు రిసార్టుకు ఇబ్బంది లేకుండా చూడాలని, కె.మత్స్యలేశం, బందరువానిపేట మధ్యలోని బ్రిడ్జి వద్ద నుంచి హార్బర్ నిర్మాణం జరిగితే బాగుంటుందని కమిషనర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించారు.

భూముల వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు రోడ్డు కనెక్టవిటీ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బందరువానిపేట మత్స్యకారులతో వేట పరిస్థితులు, ఇటీవల అందించిన బోట్లను ఆయన పరిశీలించారు.  ఎస్సీ, ఎస్టీలు మాదిరిగా 75 శాతం రారుుతీ ఇవ్వాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. పర్యటనలో  జిల్లా  మత్స్యశాఖ డీడీ  డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఎఫ్‌డీవో దివాకరరావు, ఏడీఏ నిర్మలకుమారి, ఆర్‌ఐ డి. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ గంగాధరరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు