తిరుపతి సెంట్రల్ : గ్రామీణ క్రికెట్ పోటలు హోరాహోరీగా సాగుతున్నాయి. తిరుపతి రూరల్ తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో రెండు వారాలుగా చంద్రగిరి నియోజక వర్గ స్థాయి వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో గ్రామీణ యువత స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ప్రదర్శిస్తోంది.
తమలోని ప్రతిభకు పదును పెడుతూ ముందుకెళుతోంది. గురువారం మ్యాచ్లన్నీ ఉత్కంఠభరితంగా కొనసాగాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రీడామైదానంలోనే ఉంటున్నారు. ఈ మ్యాచ్లో మహేష్ అనే క్రీడాకారుడు 29 బంతుల్లో 69 పరుగులు, హరీష్ 15 బంతుల్లో 45 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించడం విశేషం.
గెలిచిన మ్యాచ్లు ఇవే!
తుమ్మలగుంట జట్టుపై రామచంద్రాపురం పివిపురం జట్టు గెలుపొందింది. హరిపురం కాలనీపై సి.మల్లవరం బుల్లెట్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. రామమంద్రాపురం పివిపురం జట్టుపై చంద్రగిరి సుప్రీం జట్టు, పాకాల జట్టుపై శెట్టిపల్లి జట్టు గెలిచింది. పాతూరు జట్టుపై నరసింగాపురం జట్టు, అవిలాల జట్టుపై రామచంద్రాపురం పూణే లెవన్స్ జట్టు, అవిలాల బి జట్టుపై పద్మావతి పురం జట్టు, బ్రాహ్మణపట్టుపై రంగంపేట జట్టు విజయం సాధించింది.
పాకాల జట్టుపై కోదండ రామాపురం జట్టు, చిన్న గొట్టిగల్లుపై ముండ్లపూడి జట్టు, శేషాపురం జట్టుపై రామాపురం జట్టు గెలుపొందింది. బాలాజీ లెవన్స్ జట్టుపై పెరుమాళ్ల పల్లి జట్టు, పుదిపట్ల జట్టుపై అవిలాల జట్టు, భాగ్యనగర్ జట్టుపై పాతకాల్వ జట్టు విజయం సాధించాయి. దీంతో పాటు పెరుమాళ్ల పల్లి జట్టుపై నడవలూరు జట్టు, రంగంపేట జట్టుపై మంగాపురం జట్టు, వెంకి వారియర్స్ జట్టుపై అవిలాల జట్టు గెలుపొందాయి. వేదాంతపురం జట్టుపై మద్దినాయనిపల్లె జట్టు, భీమవరం జట్టుపై పాకాల తలారిపల్లె జట్టు, పాతకాల్వ జట్టుపై రామానుజ పల్లె, ఆఖరి మ్యాచ్లో ఫ్రెండ్స్ లెవన్స్ జట్టుపై చెర్లోపల్లి జట్టు విజయకేతనం ఎగురవేశాయి.