-
తాడికోన ఓఎన్జీసీ బావి నుంచి ఎగిసిన గ్యాస్ అదుపు
-
24 గంటలకే వెల్ క్యాప్ వేసిన క్రై సెస్ మేనేజ్మెంట్ టీమ్
-
మడ్ పంపింగ్, వాటర్ అంబరిల్లా ప్రక్రియలతో అడ్డుకట్ట
-
ఇళ్లకు చేరుకున్న పునరావాస బాధితులు
అమలాపురం టౌన్/అమలాపురం రూరల్:
చమురు సంస్థల అన్వేషణలు, కార్యకలాపాలతో ఎదరువుతున్న గ్యాస్ లీకేజీ ప్రమాదాల నుంచి తరచూ భయందోళనకు గురవుతున్న కోనసీమ ప్రజలకు శుక్రవారం నాటి తాడికోన ఓఎన్జీసీ బావి నుంచి ఎగిసిన గ్యాస్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. గ్యాస్ను ఓఎన్జీసీ క్రైసెస్ మేనేజ్మెంట్ టీమ్ సాంకేతిక బృందం ఘటన జరిగిన 24 గంటల్లోనే శ్రమించి, గ్యాస్ లీకేజీని అదుపు చేయడంతో కోనసీమ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాడికోనలో ఓఎన్జీసీకి చెందిన ఎస్ఆర్ ఏసీ–హెచ్హెచ్–టి–100 రిగ్, వెల్ నుంచి శుక్రవారం సాయంత్రం తీవ్ర ఒత్తిడితో, పెద్ద శబ్ధంతో గ్యాస్ లీకవుతూ ఎగదన్నిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ సన్యాల్ పర్యవేక్షణలో నర్సాపురం నుంచి వచ్చిన క్రైసెస్ మేనేజ్మెంట్ టీమ్ 24 గంటల పాటు శ్రమించి, గ్యాస్ అదుపుచేసి వెల్ ప్రివెంటర్కు వెల్ క్యాప్ వేయడంతో ఓఎన్జీసీ వర్గాలే కాకుండా, జిల్లా అధికార యంత్రంగం, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.