తాడేపల్లిగూడెం రూరల్ : గీత కార్మికుల సమస్యలపై ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నామని, కల్లు గీత కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జుత్తిగ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, మద్యం సిండికేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అక్టోబరు 1 నుంచి నూతన టాడీ పాలసీని ప్రకటించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు సంబంధిత శాఖ మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. తాటిబెల్లం ఫెడరేషన్ చైర్మన్ బొల్ల ముసలయ్య గౌడ్ మాట్లాడారు. తొలుత జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జక్కంశెట్టి సత్యనారాయణ స్థానే జుత్తిగ నరసింహమూర్తిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నాయకులు పూరెళ్ల శ్రీనివాస్, సీహెచ్ వెంకటేశ్వరరావు, దాసరి సూరిబాబు పాల్గొన్నారు.