తెలుగుపై ప్రభుత్వం చిన్నచూపు

23 Aug, 2016 23:30 IST|Sakshi
తెలుగుపై ప్రభుత్వం చిన్నచూపు
 
  • ఏ ఒక్క హామీని అమలు చేయడంలేదు
  • యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవేదన
డాబాగార్డెన్స్‌(విశాఖ): తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి త్వరలోనే రానుందని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరపు కోటేశ్వరరావు రచించిన ‘కృష్ణవేణి’ నృత్య రూపకానికి సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలుగును ఒక సబ్జెక్ట్‌గా బోధించాలని చెబితే, తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత విస్మరించిందన్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. కార్మిక దినోత్సవం రోజున శ్రీశ్రీ గహాన్ని మంచి మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌(అమెరికా)కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో ‘కృష్ణవేణి’ నృత్యరూపకం ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని చెప్పారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు