అనంతలో కాల్మనీ కలకలం

4 May, 2016 09:16 IST|Sakshi
అనంతలో కాల్మనీ కలకలం

► అప్పు కట్టలేదని టీడీపీ నేత దాడి
► మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


శింగనమల: అప్పు కట్టలేదని టీడీపీ నాయకుడు దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే...అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన బోయ జయరాముడు కుమారుడు రామాంజినేయులు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అదే గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ  భర్త, టీడీపీ నాయకుడు గోరంట్ల అనంతయ్య వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో పాటు చీటీలు నడుపుతుంటాడు.

బోయ రామాంజినేయులు రెండేళ్ల క్రితం అనంతయ్య వద్ద  రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. గత ఏడాది అతని భార్య రోడ్డు ప్రమాదంలో వృుతి చెందడం, ఆర్థిక ఇబ్బందులు ఆధికం కావడంతో అప్పు కట్టలేకపోయాడు. దీంతో మంగళవారం ఉదయం  అనంతయ్య తన ఇంటి వద్దకు రామాంజినేయులును పిలిపించి కొట్టడంతో పాటు నానా దుర్భాషలాడాడు. దీనితో  తీవ్ర మనస్తాపం చెందిన రామాంజినేయులు ఇంట్లోకి వెళ్లి  ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు