గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయమైన కోర్కెల సాధన, సమస్యల పరిష్కారం కోరుతూ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట మెడికల్, సేల్స్ రిప్స్ సోమవారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంవత్సరాలు తరబడి తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వాధికారులకు వివిధ రూపాల్లో విజ్ఞాపన చేసినా పట్టించుకోలేదని తెలిపారు. వేజ్ బోర్డును ఏర్పాటు చేసి మెడికల్ రిప్స్కు వర్తించే అన్ని రకాల సదుపాయాలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ను ఒక పరిశ్రమగా గుర్తించాలని, దీని కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ మెడికల్ రిప్పజెంటేటివ్స్ కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కావని, న్యాయ పరమైన డిమాండ్లు అని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్కు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నామని, సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. నిరాహార దీక్షలో కూర్చున్న వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి. మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు బీవీ రామిరెడ్డి, జిల్లా కోశాధికారి ఎల్వీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.