కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి తేలుస్తారు

28 Apr, 2016 11:19 IST|Sakshi
కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి తేలుస్తారు

సాక్షి విలేకరికి మంత్రి కామినేని ఫోన్లో బెదిరింపు

కైకలూరు: ‘కొల్లేరులో ప్రజలే చేపల సాగు చేస్తున్నారు. అక్కడ బడాబాబులెవరూ లేరు. నువ్వు కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి అక్కడ వాళ్లు చూస్తారు..’ అంటూ  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృష్ణాజిల్లా కైకలూరు సాక్షి విలేకరి బి.శ్యామలరాజును బుధవారం ఫోన్‌లో బెదిరించారు. మంగళవారం విజయవాడలోని ట్రావెలర్స్ బంగ్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కామినేని బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరులో చేస్తున్న అక్రమ చేపల సాగుకు సంబంధించి అటవీ శాఖాధికారి వినోద్‌కుమార్‌తో బహిరంగంగా ఫోన్‌లో మాట్లాడారు.

ఆయన స్వాధీనం చేసుకున్న సరుకుతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి మనవాడేనంటూ.. గంటలోపు వదిలివేయాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో పార్టీ వార్త కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరి శ్యామ్.. మంత్రి అటవీశాఖ అధికారితో ఫోన్‌లో సాగించిన సంభాషణను వార్తగా మలిచారు. ‘ఆ సరుకు మనోడిదే వదిలెయ్’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్‌లో మంగళవారం ప్రచురితమైంది. ఇది చదివిన మంత్రి  బుధవారం సాక్షి విలేకరికి ఫోన్ చేసి పై విధంగా హెచ్చరించారు. నీవు రాసే వార్తలతో రెండు పత్రికల విలేకరులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు