నాణ్యమైన విద్యపై జాతీయ సెమినార్‌

6 Aug, 2016 01:34 IST|Sakshi
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌సెల్‌ (ఐక్యూఏసీ) ఆధ్వర్యంలో ‘క్వాలిటీ ఎడ్యుకేషన్‌– ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ అండ్‌ చాలెంజెస్‌’ అనే అంశంపై ఈనెల 18, 19వ తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు ఐక్యూఏసీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.అరుణ తెలిపారు. సెమినార్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌(నాక్‌) ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన సెమినార్‌ బ్రోచర్‌ను శుక్రవారం వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సెమినార్‌లో అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు. ఉన్నత విద్య, నాణ్యత ప్రమాణాలు, 21వ శతాబ్దపు అవసరాలు లాంటి అంశాలపై చర్చలు విస్తృతంగా జరగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి డాక్టర్‌ కె.రాజారాం తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు