ఒక్క మొక్కలేదు

24 Jun, 2017 17:32 IST|Sakshi

► నాటేంత వరకే పరిమితం
►గత హరితహారంలో నాటింది 60,550 మొక్కలు


వికారాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పథకం వికారాబాద్‌ మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. గత సంవత్సరం వర్షకాలంలో నిర్వహించిన హరితహారంలో మున్సిపల్‌ పరిధిలోని 28 వార్డుల్లో 60,550 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కాని ఎక్కడ ఒక మొక్క పెరిగి పెద్దగైనట్లు లేదు. హరితహారం కార్యక్రమం సమయంలో స్థానిక కౌన్సిలర్లు, అధికారులు కలిసి హఠహాసంగా కార్యక్రమం నిర్వహించారు. నర్సరీల నుంచి ట్రాక్టర్ల కొలది మొక్కలను తెప్పించి నాటారు. కాని వాటి సంరక్షణ మర్చిపోయారు. ఈ వేసవిలో తీవ్ర ఎండలు ఉండటంతో ఆయా వార్డుల్లో నాటిన మొక్కలు మొక్కల దశలోనే ఎండిపోయాయి. మొక్కలు నాటి చేతులు దులిపేసుకున్న అధికారులు అటుగా చూడలేదు.

రికార్డుల్లో మాత్రం రాసారు..

వికారాబాద్‌ పట్టణం చుట్టూ ఉన్న, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల నుండి 60,550 మొక్కలు తెచ్చినట్లు మున్సిపల్‌ రికార్డుల్లో పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి మొక్కను నాటినట్లు, వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఓ నివేదికను సైతం పంపించారు. నివేధిక పంపడంతోనే తమ పని పూరై్తదనుకున్న అధికారులు మొక్కలకు నీరు పోయడం మర్చిపోయారు. మున్సిపల్‌ కార్యాలయం పక్కనే ఉన్న గాంధీ పార్కులో నాటిన మొక్కలు సైతం ఎండిపోయాయంటే హరిహారంపై అధికారుల చిత్తశుద్ది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని వార్డుల్లో మున్సిపల్‌ సిబ్బంది నామమాత్రంగా మొక్కలు నాటడంతో వారం రోజులకే ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాటిన కొన్ని మొక్కలకు కనీస రక్షణ కల్పించడంతో మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపనలు ఉన్నాయి. గత సంవత్సరం హరితహారం మొక్కల కార్యక్రమం పేరుమీద సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.



 

>
మరిన్ని వార్తలు