గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధానిని పట్టు శాలువాతో సత్కరించారు. కాగా ప్రధాని నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ముందే గన్నవరం వచ్చారు.
అనంతరం ప్రధాని మోదీ గన్నవరం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో అమరావతికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అమరావతి హెలిప్యాడ్కు చేరుకొని.. రోడ్డుమార్గంలో రాజధాని శంకుస్థాపన వేదిక అయిన ఉద్ధండరాయుని పాలెం వెళుతారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.45 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ తిరుపతి వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.