ఆ బాలిక మరణానికి కారకులు దొరికారు

17 Sep, 2016 21:20 IST|Sakshi

రాజేంద్రనగర్‌: బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమె మరణానికి కారణమైన బాలుడితో పాటు యువకుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నాలుగు నెలలుగా హౌసింగ్‌ బోర్డుకు చెందిన అక్బర్‌ (20) బాలిక తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. పాఠశాలకు వచ్చిపోయే సమయంలో వెంబడించేవాడు.

బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా అతడిని పిలిచి మందలించారు. నెల రోజుల పాటు మిన్నకుండిన అక్బర్‌ ఆ తర్వాత ఈ విషయాన్ని శాంతినగర్‌కు చెందిన తన స్నేహితుడైన బాలుడు (17)కు చెప్పాడు. 20 రోజుల క్రితం బాలిక సెల్‌ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న వీరిద్దరూ ఆమెకు ఫోన్‌ చేసి వేధిస్తున్నారు. తమలో ఎవరినైనా ప్రేమించాలని, తమతో బయటకు రావాలని భయభ్రాంతులకు గురి చేసేవారు. ఇదే క్రమంలో ఈ నెల 13వ తేదీ రాత్రి బాలికకు ఫోన్‌ చేసిన బాలుడు.. తన మాట వినకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు.

 14వ తేదీ ఉదయం మళ్లీ ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు మొదట నిందితులిద్దరూ మైనర్లని భావించారు. అనంతరం విచారణలో అక్బర్‌ వయసు 20 సంవత్సరాలుగా నిర్ధారణ కావడంతో బాలుడితో పాటు సదరు యువకుడిపై నిర్భయ కేసును నమోదు చేశారు. శనివారం ఇద్దరిని అరెస్టు చేశారు. బాలుడిని జువైనల్‌ హోమ్‌కు, యువకుడిని రిమాండ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు