టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం

19 Feb, 2017 19:16 IST|Sakshi
ప్రొద్దుటూరు క్రైం: ‘మీరు అసమర్థులు కాబట్టే నేను జలదీక్ష చేయాల్సి వచ్చింది.. మీలో సమర్థత లోపించడంతోనే నేను పాదయాత్రకు పూనుకున్నాను’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. స్థానిక మున్సిపల్‌ పార్కులో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మట్లాడారు. నీటి కష్టాలను తొలగించుటకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డి మాట్లాడిన తీరు ‘అమ్మా పెట్టనూ పెట్టదు, అడుక్కొని తిననీయదు’ అనే సామెత చందంగా ఉందన్నారు. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పెన్నా నదికి పంపించాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తే.. ప్రజలతో సంబంధం కలిగిన వ్యక్తిగా మల్లేల లింగారెడ్డి తమ దీక్షకు మద్దతు పలకాల్సింది పోయి అసూయతో ఛీప్‌ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్‌ను కలిసి నీరు విడుదల చేయించామని ఇక్కడి నాయకులు అంటున్నారని, ఆ నీటిని ప్రజలకు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్‌ దేవిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు