రాజన్న కల సాకారం

1 Jan, 2017 23:26 IST|Sakshi
రాజన్న కల సాకారం
- కేసీకి ప్రత్యామ్నాయ నీటి వనరుగా ముచ్చుమర్రి
- 2007లో శంకుస్థాపన చేసిన వైఎస్‌ఆర్‌
- బాబు చేసిన తప్పును సరిచేసిన దివంగత నేత
- తొమ్మిదేళ్లకు పూర్తయిన ఎత్తిపోతల పథకం 
- నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం
 
కర్నూలు సిటీ: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం..దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కల. కేసీ కెనాల్‌ నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం 2007లో ఈ పథకానికి వైఎస్సార్‌ పురుడు పోశారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ దీనిని పూర్తి చేసింది. సోమవారం ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా..ప్రాజెక్టు రూపకల్పన..పూర్తయిన తీరుపై సమగ్ర కథనం..   
 
కేసీ కెనాల్‌...జల రవాణా కోసం బ్రిటీష్‌ హయాంలో(1835లో) నిర్మించారు. రాయల సీమలో డొక్కల కరువు రావడంతో 1884లో దీనిని సాగునీటి కాలువగా మార్చారు. సీమలోనే పెద్ద కాలువగా పేరొందిన దీనికి 1969లో బచావత్‌ ట్రిబ్యునల్‌ 39.9 టీఎంసీల తుంగభద్ర నీటి వనరులను కేటాయించింది. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ(సుంకేసుల) ద్వారా నది నీటి ప్రవాహం నుంచి 29.9 టీఎంసీలు, టీబీ డ్యాం నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు వాడుకోవాలనే ఆదేశాలిచ్చింది. ఈ కాల్వ కింద కర్నూలు, కడప జిల్లాలో మొత్తం 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 234 కి.మీ, కడప జిల్లాలో 72 కి.మీ మేర కాల్వ  విస్తరించి ఉంది. కేటాయించిన మేరకు ఏ రోజుకు నీరు రాలేదు. ప్రతి ఏటా పంటలు ఎండిపోతూ రైతులు నష్టపోయే వారు. 
 
వైఎస్‌ఆర్‌ సొంత ఆలోచనే ముచ్చుమర్రి..
 ఒకవైపు కేసీ నీరు అందక రైతులు నష్టపోతుంటే.. 2003లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కేసీ వాటాలోని 5 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు జీఓ నంబర్‌1 జారీ చేశారు. ఆ తరువాత కూడా మరో 5 టీఎంసీలను మళ్లించాలంటూ అందులో మార్పు చేశారు. చంద్రబాబు చేసిన తప్పుతో కేసీ రైతులు పడుతున్న ఇబ్బందులను పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌ చూసి చలించారు. అధికారంలోకి వచ్చాక.. 2006లో  కేసీకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శ్రీశైలం జలాలను అందించేందుకు అవకాశాలపై సర్వే చేయాలని నాటి కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా పని చేస్తున్న పి.ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు సర్వే కూడా చేయించారు. ఇందు కోసం 2007 ఆగస్టు 31వ తేదీన రూ. 120 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబరు 196ను జారీ చేశారు. ఇందులో కేసీతోపాటు హంద్రీనీవాకు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. శ్రీశైలం బ్యాక్‌ బాటర్‌ ఉంటే ముచ్చుమర్రి దగ్గర ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌ ఏర్పాటు చేసి..అక్కడి నుంచి పైపుల ద్వారా కేసీ ప్రధాన కాలువలోకి నీరు ఎత్తిపోసేందుకు రూ. 75.26 కోట్లు కేటాయించారు. ఇందుకు 2008 జూన్‌లో శంకుస్థాపన చేశారు. పనులను మోగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. శ్రీశైలంలో 790 అడుగుల నీటిమట్టం ఉన్నంత వరకు..   నీటిని తీసుకునేలా డిజైన్‌ చేశారు. ఈ పథకం ద్వారా 35 వేల ఎకరాలకు సాగు నీరు, కర్నూలు నగర వాసుల తాగు నీరు అందనుంది.  
 
కోర్టు ఆదేశాలతో..
కేసీ వాటా నీటి మళ్లింపుపై కొంత మంది ఆయకట్టుదారులు లోకాయుక్త, హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పెండింగ్‌లో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు ఏడాది తిరిగే సరికి పంప్‌ చేసేంత వరకు చేయగలిగారు. మొత్తం నాలుగు పంప్‌లకుగాను, మూడింటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి రెండు పంప్‌ల ద్వారానే నీటిని లిఫ్ట్‌ చేసేందుకు సిద్ధం చేశారు. మరో మెటార్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు.. ఈఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకోని కాంట్రాక్ట్‌ ఏజేన్సీ అయిన మెగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ రాత్రింబవళ్లు లైట్లు వేసుకోని పనులు చేసింది. ముచ్చుమర్రి నుంచి మూడు స్టేజీల ద్వారా నీటిని ఆయకట్టుకు అందించనున్నారు. 81 కి.మీ దగ్గర కాలువలోకి వచ్చే చోట, 60, 40 కి.మీ దగ్గర లిఫ్ట్‌లు నిర్మించారు. ఈ నీరు కర్నూలు నగరం వరకు ఇప్పటికే వెనుకటికి వచ్చాయి. మనుముందు ఈ నీరే నగరవాసుల దాహాన్ని తీర్చనున్నాయి.
 
చారిత్రాత్మక ప్రాజెక్టు
        – రెడ్డి శేఖర్‌రెడ్డి, ఈఈ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చారిత్రత్మాకమైనది. ఇలాంటి ప్రాజెక్టు పనులు చేయిండచంలో నా భాగస్వామ్యం ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేయించాం. ముందుగా అప్రోచ్‌ కాలువ, పంప్‌హౌస్‌ పనులు చేశాం. కాంట్రాక్టర్‌ సైతం చాలా ఉత్సాహకంగా పని చేశారు. ప్రస్తుతం మూడు పంప్‌లు పూర్తి చేశాం. ఈ నెల చివరిలోపు నాల్గోవ పంప్‌ కూడా సిద్ధం చేస్తాం.
 
 కొత్త పద్ధతి ద్వారా రాక్‌ను తొలగించాం
   – బి.ఉమా మహేశ్వరరెడ్డి, మెగా ఇంజినీరింగ్‌ కనస్ట్రక్చన్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
ముచుమర్రి ఎత్తిపోతల పథకం పనులు 2007–08 మొదలు పెట్టాం. వరదల వల్లతో 2009లో పూడిక చేరిపోయింది. తిరిగి 2015 సంవత్సరంలో పనులు మొదలు పెట్టాం. డీ వాటరింగ్, కంట్రోల్‌ బ్లాస్టింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభించి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా రాక్‌ను తొలగించేందుకు నూతన పద్ధతిని వినియోగించాం. రోజుకు 1200 మంది కార్మికులతో 30 వేల క్యుబిక్‌ మీటర్ల కాంక్రీట్, 2 వేల టన్నుల స్టీల్‌ పనులు చేశాం. ఈ ఏడాది మార్చి వరకు గడువు ఉంది. హంద్రీనీవాకు12 పంపులు, కేసీకి 4 పంపులు ఏర్పాటు చేస్తున్నాం. కేసీకి ప్రస్తుతానికి మూడు మోటర్లు బిగించాం. రెండు పంప్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఇటీవలే ట్రయల్‌ రన్‌ చేశాం. గడువులోపు అన్ని పనులు పూర్తి చేస్తాం. 
>
మరిన్ని వార్తలు