ఆలస్యంగా వెలుగుజూసిన వైనం
నిందితుడిపై కేసులు నమోదు
వినుకొండ రూరల్(గుంటూరు) : బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి నిందితుడిపై ఫిర్యాదుచేసేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లినా సరైన సహకారం అందకపోవడంతో మూడురోజులుగా మానసిక వేదనతో కుంగిపోయింది. స్థానిక మహిళలకు విషయం చెప్పగా వారు ఆమె భుజం తట్టి మేమున్నామంటూ ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు శుక్రవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.
మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అదే ఇంట్లో గత ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్న విశాల్ బాలిక వద్దకు వచ్చి అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చి కూతురు నిద్రిస్తున్న మంచం వైపు తల్లి చూసింది. గమనించిన విశాల్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక తేరుకోవడంతో స్థానికులు వెంకాయమ్మకు మద్దతుగా నిలిచారు. ఏఎస్సై పూర్ణ చంద్రరావు కేసు నమోదు చేసి సెక్షన్ 307 క్లాస్(2), సెక్షన్ 10తో పాటు మరికొన్ని సెక్షన్లతో విశాల్పై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.