సచివాలయం కేంద్రంగా ఎంసెట్‌ లీకేజీ

1 Aug, 2016 23:18 IST|Sakshi
మాట్లాడుతున్న చెరుకు సుధాకర్‌

పంజగుట్ట: సచివాలయం కేంద్రంగానే ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలు ఉన్నట్లు సీఐడీ రిపోర్టులు వస్తున్నా ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి బర్తరఫ్‌ చేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించిన సీఎం ప్రస్తుత మంత్రులు  కడియం, లక్ష్మారెడ్డిలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందునే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మంత్రులు బాధ్యతారహితంగా ఆంధ్రాప్రాంతం వారిపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంసెట్‌ 2, 3 పేరుతో కాలయాపన చేయకుండా మేధావులతో చర్చించి విద్యార్థుల భవిష్యత్‌ పాడుకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐడీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక అనుబందంగా తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 5న ఓయూలో ఆవిర్భావ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు