అక్రమ కేసులపై న్యాయ పోరాటం

6 Jan, 2017 00:25 IST|Sakshi

పెనుకొండ : పెనుకొండ మండలం దుద్దేబండ పంచాయతీ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డిలతో పాటు ఇతరులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసును బనాయించారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసు వ్యవహారంపై ఎస్‌ఐ లింగన్నతో చర్చించడానికి శంకరనారాయణ పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. అయితే ఎస్‌ఐ అందుబాటులో లేకపోవడంతో కాసేపు వేచిచూశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని అడిగిన శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలపై పెద్దిరెడ్డి, శీనా, కేశవయ్య, రాజులు పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. తమ పంచాయతీ కేంద్రంలో ఇతర పంచాయతీకి చెందిన వ్యక్తులు రావడమే కాకుండా దాడి చేశారని సర్పంచ్, ఎంపీటీసీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులపైనే కేసులు బనాయించడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారికి నేరచరిత్ర ఉందని తెలిపారు. ఎమ్మెల్యే బీకే.పార్థ«సారథి ఒత్తిడి చేసి కేసులు పెట్టించారన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, తమ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులను  కలవనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు