154 మంది ఎన్యూమరేటర్ల షోకాజ్‌ నోటీసులు

19 Sep, 2016 23:54 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజాసాధికార సర్వే పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎన్యూమరేటర్లకు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా సర్వేలో రాష్ట్రంలోనే వెనుకబడి ఉండటంతో కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివిధ జిల్లాల్లో 80 శాతంపైగా సర్వే పూర్తయింది. జిల్లాలో మాత్రం 60 శాతం మాత్రమే ఉంది. దీంతో తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్ల నుంచి సర్వేను నిర్లక్ష్యం చేస్తున్న ఎన్యూమరేటర్ల వివరాలను తీసుకున్నారు. ఏకంగా 154 మంది ఎన్యూమరేటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు సర్వేకు గైర్హాజర్‌ కాగా మరికొందరు తూతూ మంత్రంగా సర్వేకు హాజరువుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అయిన ప్రజా సాధికార సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలుపాలని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. తొలుత నంద్యాల మున్సిపాలిటీలో 18 మందికి, ఆత్మకూరు నగరపంచాయతీలో 6 మంది, వివిధ మండలాల్లో 13 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తాజాగా కర్నూలు నగరపాలక సంస్థలో 31 మంది షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో 40 మందికి, నంద్యాల డివిజన్‌లో 8 మంది, ఆదోని రెవెన్యూ డివిజన్‌లో 38 మందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.    
 
మరిన్ని వార్తలు