ఆర్టీపీపీ ఉద్యోగిపై ఎస్పీఎఫ్‌ సిబ్బంది దాడి

17 Nov, 2016 01:05 IST|Sakshi

ఎర్రగుంట్ల:
    వైఎస్సార్‌ జిల్లా ఆర్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగి దివ్యనాథ్‌ను స్పెషల్‌ ప్రొటెక‌్షన్‌ ఫోర్స్‌( ఎస్‌పీఎఫ్‌ ) ఎస్‌ఐ శివతో పాటు ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి.   డబ్బుల కోసం ఆర్టీపీపీలోని ఆంధ్రా బ్యాంక్‌ వద్ద బుధవారం క్యూలో నిలబడి ఉన్న ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఉద్యోగులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో దివ్యనాథ్‌ అనే ఉద్యోగిని ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది లాఠీలతో చితకబాదారు. కాగా, ఎస్‌పీఎఫ్‌ ఎస్‌ఐ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలమల్ల పోలీసులు దివ్యనాథ్‌ అనే ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వెంటనే ఉద్యోగిని విడుదల చేయాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగి గేటును మూసి వేశారు.  ఈ ఆందోళన బుధవారం రాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగి దివ్యనాథ్‌  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌పీఎఫ్‌ ఎస్‌ఐ శివపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. దీంతో ఉద్యోగులు శాంతించారు.
 

మరిన్ని వార్తలు