విద్యార్థిని కబళించిన విద్యుత్‌

8 Aug, 2017 22:55 IST|Sakshi

కనగానపల్లి: విద్యుత్‌ మోటర్‌ తీగ ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కొళాయి నీటిని మోటార్‌ ద్వారా పట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తూంచర్లకు చెందిన బిల్లే పెద్దన్న, నారమ్మ దంపతుల రెండో కుమారుడు బిల్లే సంతోష్‌ (12) ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పశువులపాక వద్ద తొట్టెకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో పంచాయతీ కొళాయి నుంచి నీరు తక్కువగా వస్తుండటంతో అక్కడే ఉన్న విద్యుత్‌ మోటర్‌ (జెట్‌ మోటర్‌) వేశాడు.

మోటర్‌ ఆన్‌ చేయగానే పైపు ఊడిపోయింది. దానిని తిరిగి అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోటార్‌ విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో విద్యుదాఘాతంతో విలవిలలాడి అక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపు వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని వార్తలు