కెనరాబ్యాంకులో మళ్లీ చోరీ

1 Dec, 2016 23:48 IST|Sakshi
కెనరాబ్యాంకులో మళ్లీ చోరీ
 
మాచర్ల : పట్టణంలోని బస్టాండ్‌కు సమీపంలో ఉన్న కెనరాబ్యాంక్‌లో నగదు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఖాతాదారుడి జేబులోంచి రూ.14,500 నగదు చోరీ చేసిన సంఘటన గురువారం జరిగింది. మండలంలోని రాయవరం గ్రామానికి బీమా వెంకటేశ్వర్లు తన స్నేహితులతో కలసి కెనరాబ్యాంక్‌లో రూ.15వేలు డిపాజిట్‌ చేసేందుకు వచ్చాడు. టేబుల్‌పై వంగి డిపాజిట్‌ ఫారం నింపుతున్న సమయంలో చొక్కా పైజేబులో ఉంచుకున్న నగదును పక్కనే ఉన్న ఓ దుండగుడు  కాజేశాడు. జేబులో నగదు లేకపోవడాన్ని గమనించి వెంకటేశ్వర్లు బ్యాంక్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ వద్దకు వెళ్లి నగదు పోయిన సంగతి చెప్పగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా సంచరించగా, అందులో ఒకరు టవల్‌ చేతికి అడ్డం పెటుకుని చోరీకి పాల్పడినట్టు గమనించారు. సంబంధిత విషయాన్ని పట్టణ పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ జి.నారాయణ కూడా వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి దొంగతనం జరిగినట్టు నిర్ధారించారు. పది రోజుల కిందట ఇదే బ్యాంక్‌లో చోరీ జరిగింది. పదిహేను రోజుల కిందట ఆంధ్రాబ్యాంక్‌ వద్ద గుండ్లపాడుకు చెందిన మంగమ్మ అనే వృద్ధ మహిళ వద్ద నుంచి రూ. 27 వేలు పాతనోట్లు చోరీ చేశారు. మూడు చోరీ సంఘటనల్లో డిపాజిట్‌ చేయడానికి తీసుకువచ్చిన పాతనోట్లే చోరీకి గురికావడం గమనార్హం.
 
మరిన్ని వార్తలు