జనహృదయ నేత.. అభివృద్ధి ప్రదాత

8 Jul, 2017 02:29 IST|Sakshi
జనహృదయ నేత.. అభివృద్ధి ప్రదాత

జిల్లాతో మహానేత వైఎస్సార్‌కు  ఎనలేని అనుబంధం
∙ నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి


అన్నా.. రాజన్నా..! 108కు ప్రాణం పోశావు. కుయ్‌.. కుయ్‌ రాగానికి కోకిల అయ్యావు. ఆరోగ్యశ్రీకి అంకురార్పణ చేశావు. ప్రాణాంతక రోగమొస్తే.. దేవుడిపైనే భారం వేసే పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణదాతవయ్యావు. పేదోడికి నీడనిచ్చే గొడుగువయ్యావు. వారి సొంతింటి కలను సాకారం చేశావు. ప్రతి ఇంటికీ పెద్ద దిక్కు నీవయ్యావు. ప్రాజెక్టులకు నడకనిచ్చావు. జలయజ్ఞ ప్రదాతవయ్యావు. అన్నదాత కంట కన్నీరు తుడిచావు. జనం అడిగనవన్నీ ఇచ్చావు. అడగనవీ గుదిగుచ్చి మరీ వారి చెంత చేర్చావు. అందరిపాలిట ఆపద్బాంధవుడవయ్యావు. నీవు వెళ్లిపోయావ్‌ రాజన్నా..!

నీ అడుగు జాడలు ఇక్కడే ఉన్నాయ్‌. నీ జ్ఞాపకాలు మా గుండెల్లో ఇంకా తడిగానే తగులుతున్నాయ్‌. నీవు లేని ఈ లోకం నిండా తీరని శోకం అలముకుంది. పథకాలన్నీ పతనమయ్యాయ్‌. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. అబద్ధం.. అవినీతి శాసనాలయ్యాయ్‌. మా బతుకుల్ని ‘బాబో’య్‌   అని భయపెడుతున్నాయ్‌. ఆనాటి పాలన కోసం.. ఆ ఉషస్సు కోసం.. అహరహం శ్రమిస్తాం.. నిరతం నీకు నిజమైన నివాళి అర్పిస్తాం.


నెల్లూరు (సెంట్రల్‌) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ఈ లోకం నుంచి దూరంగా వెళ్లి దరిదాపు 8 ఏళ్లు కావస్తోంది. కానీ నేటికీ ఆయన పాలనను జనం మరిచిపోలేకున్నారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాభివృద్ధిని, రాష్ట్ర ప్రజలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు బాటలు వేసిన రథసారథిగా జన హృదయాలను గెలిచిన మహానేత. జలయజ్ఞంతో అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణదాతగా, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతల ఆత్మబంధువుగా, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు కట్టించి, అపారంగా సామాజిక పింఛన్లు ఇచ్చి అభాగ్యుల పాలిట ఇంటి పెద్దగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన గొప్ప దార్శనికుడిగా వైఎస్సార్‌ జనం గుండెల్లో పదిలంగా కొలువై ఉన్నారు. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా.. అభివృద్ధి ప్రదాతగా చరిత్రను లిఖిం చారు. జిల్లాలో మహానేత వైఎస్సార్‌ వేసిన అభివృద్ధి బీజాలు.. నేడు ఫలాలు ఇస్తున్నాయి. దివంగత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జిల్లాతో ఆయనుకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ..కొన్ని జ్ఞాపకాలు.

∙2008లో జిల్లాలో వీఎస్‌యూ ఏర్పాటుతో విద్యారంగ అభివృద్ధికి బీజం వేశారు. వెంకటాచలం సమీపంలోని కాకుటూరు వద్ద 82 ఎకరాలను కేటాయించారు. యూనివర్సిటీ  అభివృద్ధి కోసం రూ.82 కోట్లతో క్యాపిటల్‌ ఫండ్‌ కింద నిధులను మంజూరు చేసి ఆరు కోర్సులను ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా గొలగమూడి వద్ద ఇండియన్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలను తీసుకు వచ్చారు.

∙ ఉప్పు  రైతులకు శాపంగా మారిన విద్యుత్‌ టారిఫ్‌ సమస్యపై స్పందించారు. ఉప్పు రైతుల బా«ధను అర్థం చేసుకుని యూనిట్‌కు రూ.4 ఉన్న దాన్ని రూ.1 తగ్గిస్తూ 2008 మార్చి 29న ఉత్తర్వులు జారీ చేశారు. మహానేత మరణానంతరం రూ.1 ఉన్న యూనిట్‌ ధరను మళ్లీ రూ.4లకు పెంచడం గమనార్హం.

∙ ఆరోగ్యశ్రీ రెండో విడత కార్యక్రమానికి నెల్లూరు నుంచే శ్రీకారం చుట్టి జిల్లాపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు.

∙ జిల్లాకే తలమానికంగా.. ప్రపంచ పటంలో స్థానాన్ని కల్పిస్తూ ముత్తుకూరు వద్ద కృష్ణపట్నం పోర్టును ఏర్పాటు చేసి జిల్లా రూపురేఖలనే మార్చేశారు. 1,600 మెగా వాట్ల సామర్థ్య కలిగిన ఏపీ జెన్‌కో «థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

∙ 2005లో తడ మండలం మాంబట్టు సెజ్, 2006లో నాయుడుపేట మండలం మేనకూరు సెజ్, 2008లో శ్రీసిటీ సెజ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సెజ్‌ల్లో అనేక కంపెనీలు ఏర్పాటు కావడంతో ప్రస్తుతం వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగింది.

∙ జిల్లాలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి కోట్లాది రూపాయల విద్యుత్‌ బకాయిలు రద్దు చేసి ఆక్వా రైతుల పాలిట ఆత్మ బంధువుయ్యారు.

∙ పెన్నా డెల్టా ఆధునికీకరణకు, సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థానలు చేశారు. ప్రధానంగా స్వర్ణముఖి బ్యారేజీ నిర్మాణానికి గతంలో కొంత మంది రాజకీయ ప్రముఖులు శంకుస్థాపనలు చేసినా అవి ప్రారంభంలోనే ఆగిపోయాయి. వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. దీని వల్ల కోట, వాకాడు మండలంలో భూగర్భ నీటి మట్టం పెరిగి రైతులకు  మేలు జరిగింది.

∙ ఇఫ్కో ఆధీనంలోని 2,700 ఎకరాల్లో అభివృద్ధి ఏ మాత్రం జరగకపోవడంతో దీన్ని కిసాన్‌ సెజ్‌గా మార్చి వ్యవసాయ ఆథారిత పరిశ్రమల ఏర్పాటుకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందని చెప్పాలి.

∙ సోమశిల రిజర్వాయర్‌లో నీటి సామర్థ్యం 38 టీఎంసీల నుంచి 78 టీఎంసీలకు పెంచేందుకు వైఎస్సార్‌ చేసిన కృషి జిల్లా చరిత్ర రికార్డుల్లో నిలిచిపోతారు. నీటి సామర్థ్యం పెంపు వల్ల ప్రస్తుతం ఎంతో మందికి మేలు జరుగుతుంద ని వైఎస్సార్‌ను కీర్తించని వారు లేరంటే అతిశయోక్తి లేదు. భూ సేకరణలో చుట్టు పక్కల ప్రాంతాల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధిక మొత్తంలోనే  నష్టపరిహారం అందించి జిల్లాకే కాక, చిత్తూరు జిల్లా రైతులు, చెన్నై వాసుల తాగునీటి దాహార్తిని తీర్చిన అపర భగీరథుడుగా నిలిచిపోయారు.
∙ప్రధానంగా జిల్లాకు తలమానికంగా ఉన్న నెల్లూరు మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పించి నెల్లూరుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇలా ఎన్నో సామాజిక అభివృద్ధికి బాటలు వేసిన ప్రదాత.. జిల్లాలో లక్షలాది కుటుంబాలను వ్యక్తిగతంగా అనేక విధాలుగా ఆదుకున్న ఆపద్బాంధువుడిగా వైఎస్సార్‌ జనం గుండెల్లో నిండిపోయారు.

>
మరిన్ని వార్తలు