గేదెలతో రాస్తారోకో

1 Aug, 2016 22:49 IST|Sakshi
జాతీయ రహదారిపై గేదెలతో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు
  • ఎంసెట్‌–2 రద్దు యోచనను విరమించుకోవాలని డిమాండ్‌ 
  • కాంగ్రెస్‌ నాయకుల వినూత్న నిరసన 
  • ములుగు : రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌–2 రద్దు యోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ములుగులో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం గేదెల గుంపుతో వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంసెట్‌–2 లీకే జీతో ప్రభుత్వ అధికారులు, మంత్రులకు సంబంధం ఉందని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  
     
    అలాగే, సంబంధిత శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత స్థాయి అధికారులను ఇప్పటి వరకు బర్తరఫ్‌ చేయకపోవడ సిగ్గుచేటని అన్నారు. కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన అక్రమానికి మిగతా విద్యార్థులను బలి చేయడం దారుణమని అన్నారు. నిరసన కార్యక్రమంలో  బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బానోతు రవిచందర్, బాబీ, యూనస్, ఎస్‌.కే.ఉమర్, సర్పంచ్‌ జంజిరాల దేవయ్య  పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు