గ్రామపెద్దల ఆటవిక తీర్పు..

5 Oct, 2016 06:07 IST|Sakshi
గ్రామపెద్దల ఆటవిక తీర్పు..

హత్యకు గురైన యువతి తండ్రికి కుల బహిష్కరణ

- గతేడాది అత్యాచారం.. హత్యకు గురైన కూతురు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
- హంతకుడితో రాజీపడాలన్న గ్రామ పెద్దలు
- జంగరాయి గ్రామ పెదరాయుళ్ల తీరు
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/చిన్న శంకరంపేట: ఆ తండ్రి ఒక్కగానొక్క కూతురును అత్యంత పాశవికంగా ఓ మృగాడు హత్యచేశాడు.. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై కత్తులతో పొడిచి.. పొడిచి చంపేశాడు.  శవాన్ని డ్రమ్ములో కుక్కి అడవిలో విసిరేశాడు. తన కూతుర్ని చంపిన కిరాతకుడిని శిక్షపడాలని ఆ తండ్రి  కోర్టులు, ఠాణాల చుట్టూ తిరుగుతుంటే, గ్రామ పెదరాయుళ్లు మాత్రం రివర్స్‌లో వచ్చారు. హంతకుడితో రాజీపడాలంటూ మృతురాలి  తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. లెక్కచేయని మృతురాలి తండ్రిని కుల బహిష్కరణ చేశారు. తీర్పును ఉల్లంఘించిన వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన చెరుకు దుర్గారెడ్డి కూతురు మౌనిక (22) గతేడాది మేలో ఇంటికి వచ్చింది.

మూడు రోజులపాటు ఇంట్లోనే ఉన్న మౌనిక అదేనెల 13న ఇంటి నుంచి వెళ్లిపోయింది.  కూతురు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అదేనెల 16న మెదక్ మండలం రాయిన్‌పల్లి అటవీప్రాంతంలో శవమై కన్పించింది. మౌనికపై అత్యాచారం చేసి, కత్తులతో పొడిచి, మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో కుక్కి అటవీప్రాంతంలో విసిరేసి పోయారు. ఈ కేసుపై విచారణ జరిపిన మెద క్ రూరల్ పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం. రాంరెడ్డి  ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి, అతనిపై హ త్యానేరం కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పిం చుకు తిరగుతున్న రాంరెడ్డిని ఏపీ గుంటూరు జిల్లాలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హంతకుడికి భార్య, ఇద్దరు పిల్లలు, జంగరాయిలో 4 ఎకరాల పొలం ఉంది.  బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ రాంరెడ్డి ఊరుకు దూరంగానే ఉన్నాడు. పొలాన్ని దున్నటానికి  ఎవరూ ముందుకు రాకపోవటంతో  బీడుపడింది. కాగా ఇటీవల రాంరెడ్డి కొంతమంది గ్రామ పెద్దలను కలిసి మృతురాలు తండ్రి దుర్గారెడ్డికి, తనకు మధ్య రాజీ కుదర్చాల న్నాడు. కులపెద్దలు దుర్గారెడ్డిని పిలిచి పంచా యితీ పెట్టారు. పంచాయితీలో రాంరెడ్డి తప్పు చేశాడని నిర్ధారించారు. అతను చేసిన తప్పుకు శిక్షగా రూ 1.5 లక్షలు జరిమానా విధిస్తామని, కేసులో రాజీపడాలని కులపెద్దలు దుర్గారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తన కూతురును హత్య చేసిన వ్యక్తితో రాజీపడేదిలేదని చెప్పి  గ్రామపెద్దల మాటను దుర్గారెడ్డి తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు దుర్గారెడ్డి కుటుం బాన్ని కుల బహిష్కరణ చేశారు.  ఊరిలో ఆయన కుటుంబానికి ఎవరైనా సహకరిస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

 తీర్పు తక్షణమే అమల్లోకి...
 ఈ తీర్పుతో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు దుర్గారెడ్డి భార్య లక్షి బతుకమ్మను తీసుకొని వెళ్లగా.. తోటి మహిళలు ఆమెను కలవనివ్వలేదు.   మరోవైపు దుర్గారెడ్డి కొడుకు పెళ్లికి ముహుర్తం కూడా పెట్టుకున్నాడు. గ్రామపెద్దల తీర్పుతో ఈ పెళ్లి పనులకు గ్రామస్తులు ఎవరూ సహకరించడం లేదు.
 
 సంపినోడికి శిక్షపడాల్సిందే
 నా బిడ్డను చంపిన హంతకుడితో రాజీపడితే నాకు రూ. 1.5 లక్షలు ఇప్పిస్తామని మా గ్రామ పెద్దలు నాపై ఒత్తిడి తెచ్చారు. నా బిడ్డే పోయినంక.. ఇక ఈ డబ్బు నాకు ఎందుక న్నా.. నా బిడ్డను చంపిన హంతకుడు వాడు, వానికి శిక్ష పడాలని చెప్పిన.. నా మాటలు త ప్పట.. అంతా కలిసి నన్ను, నా కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. - దుర్గారెడ్డి
 
 కౌన్సిలింగ్ చేశాం : ఎస్‌ఐ
 గ్రామ పెద్దల తీర్పుపై దుర్గారెడ్డి చిన్నశంకరంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సైను వివరణ కోరగా.. ఫిర్యా దు అందిన మాట నిజమేనన్నారు. గ్రామంలోని కులపెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు