పార్కుల ఆహ్లాదం ఎక్కడ..

21 Jul, 2016 18:27 IST|Sakshi
పార్కుల ఆహ్లాదం ఎక్కడ..

–పార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టని పాలకవర్గం
–గాంధీ పార్కులో సైతం కానరాని పచ్చదనం
కోదాడఅర్బన్‌: సుమారు 65వేల జనాభా, ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కోదాడ పట్టణ ంలో ప్రజల ఆహ్లాదం కోసం కనీసం ఒక్క పార్కు కూడా లేదు. సాయంత్రం వేళల్లో సరదాగా కాసేపు గడిపేందుకు అనువైన స్థలాలు పట్టణ వాసులకు కరువువయ్యాయి.  మున్సిపాలిటీగా ఏర్పడి 5సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ఒక్క కొత్త పార్కు కూడా రూపొందలేదు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతీ సందర్భంలోనూ చెప్పే పాలకవర్గం కూడా నేటివరకు పార్కుల ఏర్పాటుపై ఏ సమావేశంలోనూ చర్చించిన దాఖలాలు లేవు.
పార్కుల అభివృద్ధిపై శీత కన్ను..
పట్టణంలో ప్రస్తుతం ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. పేరుకు ఇది పార్కే కానీ ఇందులో పచ్చదనం మాత్రం కానరాదు. ఈ పార్కు స్థలంలో గ్రంథాలయం, మండల సమాఖ్యల కార్యాలయాలు నిర్మించడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన తరువాత బైపాస్‌రోడ్‌లోని ఓ వెంచర్‌లో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడిచినా, నేటివరకు పనులు పూర్తికాలేదు.  ఈ పార్కును అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  పట్టణంలో ఖళీగా ఉన్న మున్సిపల్‌ స్థలాలను మినీ పార్కులుగా అభివృద్ధి చేస్తే అవి కొంత మేరకైనా ఉపయోగపడతాయని పలువురు బావిస్తున్నారు.  ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గ సభ్యులు స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కులు అభివృద్ధి చేయాలని పలవురు పట్టణ వాసులు కోరుతున్నారు.
పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వంటిపులి అనిత, చైర్‌పర్సన్‌
కోదాడ పట్టణంలోని ప్రజల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గాంధీపార్కుని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించాం. మున్సిపాలిటీకి రావాల్సిన లేఅవుట్‌ స్థలాలను స్వాధీనం చేసుకుని పార్కులను అభివృద్ధి చేస్తాం.
 

>
మరిన్ని వార్తలు