చేవెళ్లలో.. హోరాహోరీ

26 Apr, 2014 01:04 IST|Sakshi
చేవెళ్లలో.. హోరాహోరీ

చేవెళ్ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కె.శ్రీకాంత్‌రావు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధించాలన్నా.. నగర శివార్లలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల ఓటర్లున్నారు.
 
 బరిలో కొత్త ముఖాలు
 కాంగ్రెస్ నుంచి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, తెలుగుదేశం నుంచి మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి మనువడు కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ పక్షాన కొండా రాఘవరెడ్డి రంగంలో ఉన్నారు. వారంతా మొదటిసారి పోటీ చేస్తున్న వారే. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులపైనే వీరు ఆధారపడి ఉన్నారు.  ప్రధానంగా తాండూరు, రాజేంద్రనగర్‌లలో మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి.
 
 అసెంబ్లీ అభ్యర్థులదే భారం
 ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఏడుగురిలో సబితా ఇంద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం తో మిగిలిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే మినహా ఐదుగురు తీవ్ర పోటీ ఎదుర్కొం టున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు హరీశ్వర్‌రెడ్డి(పరిగి), మహేందర్‌రెడ్డి(తాండూరు), కె .ఎస్.రత్నం(చేవేళ్ల), వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, శేరిలిం గంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావంతో పార్లమెంట్‌కు క్రాస్ ఓటింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఎంీపీ అభ్యర్థిని విస్మరించి తమ వరకు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు.  
 
 సెగ్మెంట్ల వారీగా బలాబలాలు
 పరిగి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి రాంరెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి హరీశ్వర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే వరుస విజయాలు సాధించిన హరీశ్వర్‌రెడ్డిపై ఈసారి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కమతం రాంరెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీనితో కాంగ్రెస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి  సైతం ప్రచారంలో దీటుగా వెళ్తున్నారు.
 -    తాండూరులో మహేందర్‌రెడ్డి(టీడీపీ), నారాయణరావు(కాంగ్రెస్), నరేష్(టీడీపీ), ప్రభుకుమార్(వైఎస్సార్‌సీపీ) బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రభుకుమార్ మిగిలిన అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.  
 -    వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ నుంచి సం జీవరావు, వైఎస్సార్‌సీపీ నుంచి క్రాంతికుమార్, బీజేపీ నుంచి పుష్పలీల పోటీ చేస్తున్నారు.
 -    చేవేళ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య రంగంలో ఉండగా, టీడీపీ నుంచి వెంకటేష్ రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యనే ఉంది.
 -    రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్(టీడీపీ), మజ్లిస్, జ్ఞానేశ్వర్(కాంగ్రెస్), ముజ్తాబా అహ్మద్(వైఎస్సార్‌సీపీ) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం మజ్లిస్, టీడీపీ మధ్యనే నెలకొంది.
 -    శేరిలింగంపల్లిలో వైఎస్సార్‌సీపీ నుంచి ముక్కా రూపానందరెడ్డి(వైస్సార్‌సీపీ), భిక్షపతియాదవ్(కాంగ్రెస్),అరికెపూడి గాంధీ(తెలుగుదేశం) బరిలో ఉన్నారు.
 -    మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టీడీపీ నుంచి తీగెల కష్ణారెడ్డి, సీపీఐ నుంచి అజీజ్‌పాషా మధ్య పోటీ నెలకొంది.

మరిన్ని వార్తలు