ఆహ్వానం లేకున్నా వచ్చి చేరండి: జేఎస్పీ

25 Mar, 2014 03:28 IST|Sakshi

 హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు టీడీపీ, బీజేపీల్లో చేరడం ఆత్మహత్యాసదృశమని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) వ్యాఖ్యానించింది. తాము ఆహ్వానించకపోయినా సమైక్యవాదాన్ని వినిపించే తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చింది. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ప్రెసిడెన్షియల్ బ్యూరో సమావేశం జరిగింది.

మేనిఫెస్టో రూపకల్పన, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, వివిధ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి తెలిపారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ పార్టీ పోటీచేస్తుందని, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోందని తెలిపారు. సీమాంధ్ర పర్యటన అనంతరం పార్టీ అధ్యక్షుడు కిరణ్ తెలంగాణలోనూ పర్యటిస్తారని చెప్పారు.
 

మరిన్ని వార్తలు