విద్వన్మణి గణపతిముని

9 Jun, 2019 03:19 IST|Sakshi

గురు సన్నిధి

దేశం నలుమూలలనుంచీ వచ్చిన కవులూ, పండితులతో నవద్వీప పండితసభ కోలాహలంగా ఉంది. సభలో నెగ్గినవారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదులను ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సభలో తన సత్తా నిరూపించుకోడానికి వచ్చాడో తెలుగు యువకుడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. ఆశుకవితా దురంధరుడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆసేతు హిమాచలమంతా కీర్తించిన ఆ ప్రతిభామూర్తియే అయ్యలసోమయాజుల గణపతిముని. వినాయకుడి అనుగ్రహంతో జన్మించినందున తల్లిదండ్రులు పెట్టినపేరు గణపతి. చిన్నతనంలోనే పురాణ–ఇతిహాసాలతోబాటు జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా కరతలామలకం చేసుకున్నారు.

ఆనాటి పండిత లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన నవద్వీపసభలో గణపతిముని తన పాటవాలను నిరూపించుకుని‘కావ్యకంఠ‘ బిరుదును పొందారు. తత్త్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని ఆనాటి పండితులు అభిప్రాయ పడ్డారు. వారి రచనల్లో ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమాశతకం, రమణగీత, దశమహావిద్యలు వంటి గ్రంథాలు ముఖ్యమైనవి. నాయనగారు..! తీవ్రమైన తపోకాంక్షతో అరుణాచలం చేరిన వీరిని చూసి అక్కడున్న బ్రాహ్మణస్వామి తమ దీర్ఘకాలిక మౌనాన్ని వీడి ‘నాయనా‘ అని ప్రేమపూర్వకంగా పిలిచారు. ‘రమణ మహర్షులకు‘ నమస్కారం అంటూ  సంబోధించిన గణపతిముని మాటతో ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామి రమణ మహర్షిగా ప్రజలలో స్థిరమయ్యారు.
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని
వేదపండితులు

మరిన్ని వార్తలు