ఐసెట్ - 2014 కౌన్సెలింగ్

15 Sep, 2014 00:40 IST|Sakshi
ఐసెట్ - 2014 కౌన్సెలింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్ (ఐసెట్) వెబ్ కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఐసెట్-2014లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ విధానాన్ని కొనసాగించనున్నారు. మొత్తం 520 ఎంసీఏ కళాశాలల్లో 38580 సీట్లు, 934 ఎంబీఏ కళాశాలల్లో లక్షకుపైగా సీట్లున్నాయి.

ఈ క్రమంలో ముందుగా అభ్యర్థులు.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. తమ ర్యాంకుకు కేటాయించిన తేదీలలో ఏదైనా హెల్ప్‌లైన్ సెంటర్‌లో హాజరై అన్ని ధ్రువపత్రాలు చూపితేనే.. తదుపరి దశ ఆప్షన్ల ఎంట్రీకి అనుమతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంబీఏ.. ఎంసీఏ.. కావాల్సిన లక్షణాలు.. ఉత్తమ కళాశాలను ఎంపిక చేసుకోవడం ఎలా? వంటి విషయాలపై విశ్లేషణ..
 
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఎందుకు?
మేనేజ్‌మెంట్ పీజీని లక్ష్యంగా ఎంచుకున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా స్పష్టత పొందాల్సిన ప్రశ్న ఇది. లేకుంటే రెండేళ్ల శ్రమ, ఆ తర్వాత తీసుకునే సర్టిఫికెట్ రెండూ వృథాగానే మిగులుతాయి. ఇక.. ఎంబీఏ ఎందుకు? అనే ప్రశ్నకు రెండు కోణాల్లో సమాధానాన్ని తెలుసుకోవాలి. అవి పరిశ్రమలు; విద్యార్థులు.
పరిశ్రమల కోణంలో ఆలోచిస్తే..
వ్యాపార నిర్వహణ మెళకువలు తెలిసిన అభ్యర్థులు లభిస్తారు.
కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉంటుంది.
ఉత్పాదకతను పెంచే వ్యూహాల్లో మెళకువలు సాధిస్తారు.
చివరికి సంస్థను లాభాల బాట పట్టిస్తారు.
విద్యార్థుల కోణంలో..
సొంతగా పరిశ్రమలు/కంపెనీల ఏర్పాటులో నైపుణ్యం.
ఇతర కోర్సులతో పోల్చితే కెరీర్‌లో వేగంగా పెకైదిగే అవకాశం.
 
లభించే లక్షణాలు:
సృజనాత్మక సంస్థలు నెలకొల్పి, తీర్చిదిద్దడం అనేది ఎంబీఏ ద్వారానే సాధ్యం. ఈ కోర్సు నిర్వహణ నైపుణ్యాలతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలో రెండేళ్ల కోర్సులో విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్; టెక్నికల్ నాలెడ్జ్; లీడర్‌షిప్ స్కిల్స్; బిజినెస్ స్కిల్స్; మేనేజ్‌మెంట్ స్కిల్స్; కమ్యూనికేషన్ స్కిల్స్; ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్; స్మార్ట్ థింకింగ్ స్కిల్స్; రిలేషన్‌షిప్ స్కిల్స్ అలవడతాయి.
 
మొదటి ఏడాది ఇలా:
సాధారణంగా ఎంబీఏ కరిక్యులంను పరిశీలిస్తే మొదటి ఏడాదిలో ఎంబీఏ విద్యార్థులకు కోర్ సబ్జెక్టులైన.. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మేనేజ్మెంట్; మేనేజీరియల్ ఎకనామిక్స్; ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్; బిజినెస్ లా; బిజినెస్ కమ్యూనికేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు. కార్యనిర్వాహక నైపుణ్యాలే కాకుండా ఒక సంస్థ నిర్వహణలో భాగమైన ఆయా విభాగాల్లో పరిజ్ఞానం అందించడమే ఈ సబ్జెక్టుల లక్ష్యం.
 
స్పెషలైజేషన్ సెకండియర్:
మొదటి సంవత్సరం అంతా ఉమ్మడి సబ్జెక్టులతో సాగే ఎంబీఏ బోధన రెండో ఏడాది స్పెషలైజేషన్ సబ్జెక్టులపై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తనకు అనుకూలమైన స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, రిటైల్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
 
కోర్సు పూర్తయ్యాక:
ప్రస్తుతం ఓ మోస్తరు కళాశాల నుంచి ఐఐఎంల వరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు అంతర్భాగంగా మారుతున్నాయి. ఎంబీఏ చదివిన విద్యార్థులకు భవిష్యత్తుపై బెంగ అనవసరం. ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా మంచి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు వ్యక్తిగత ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.  
  ఫైనాన్స్ మేజర్ స్పెషలైజేషన్‌గా తీసుకున్న అభ్యర్థులకు అవకాశాలు అన్ని పరిశ్రమల్లో లభిస్తాయి. బ్యాంకింగ్- ఫైనాన్‌‌స- ఇన్సూరెన్‌‌స రంగాల్లో మరిన్ని అవకాశాలుంటాయి.
  హెచ్‌ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు పరిశ్రమలు, ఉత్పత్తి సంస్థల్లో మానవ వనరుల నిర్వహణలో ఉద్యోగాలు ఉంటాయి.
  మార్కెటింగ్ స్పెషలైజ్డ్ అభ్యర్థులకు అవకాశాలకు ఆకాశమే హద్దు. రిటైల్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎక్కడైనా వీరికి అవకాశాలు ఖాయం.
 
రాణించాలంటే:
కోర్సు, ఆ తర్వాత కెరీర్‌లో రాణించాలంటే విద్యార్థులు కేవలం అకడమిక్స్‌కే పరిమితం కాకుండా మరికొన్ని స్కిల్స్ పెంచుకోవాలి.
బిహేవియరల్ స్కిల్స్; ఇంటర్‌పర్సనల్ స్కిల్స్; లీడర్‌షిప్ క్వాలిటీస్ కోసం మేనేజ్‌మెంట్ క్లబ్‌లు, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్పంచుకోవాలి. సెమినార్లు, మేనేజ్‌మెంట్ సమ్మిట్స్‌కు హాజరవ్వాలి. ఫలితంగా నిర్దేశిత రంగంలోని వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ఎనలిటికల్ థింకింగ్ దృక్పథం అలవర్చుకోవాలి. పాఠ్యాంశాలను చదువుతూ వాటికి సంబంధించి రియల్ కేస్ స్టడీస్‌ను పరిశీలిస్తే మంచి ఫలితముంటుంది.
 
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ ఎందుకు?

సాధారణంగా ఎంసీఏ అంటే ప్రోగామింగ్ లాంగ్వేజెస్ బోధించే కోర్సు అని అభిప్రాయం. అయితే ఎంసీఏలో విద్యార్థులకు మరెన్నో మెళకువలు లభిస్తాయి. అవి..
తాజా అప్లికేషన్ డెవలప్‌మెంట్
లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్
లభించే పలు సాఫ్ట్‌వేర్ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించే సత్తా ప్రతి ఎంసీఏ విద్యార్థికి లభించేలా చేయడమే కోర్సు ప్రధానోద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ జీవితంలో కూడా విధుల్ని వేగంగా నిర్వర్తించే లక్షణం అలవడుతుంది.
 
రాణించాలంటే:
ఎంసీఏలో రాణించాలంటే విద్యార్థులు ముందుగా స్వీయ లెర్నింగ్ లక్షణాన్ని అలవర్చుకోవాలి. క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. అంతేకాకుండా కేవలం బుక్ రీడింగ్‌కే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో నిత్యం ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటూనే ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ టెక్నికల్ కోర్సులను ఒడిసిపట్టాలి. ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే ఎడెక్స్, కోర్సెరా, మూక్స్, ఎన్‌పీటీఈఎల్ వంటి  వెబ్‌సైట్స్‌లో కోర్సులు పూర్తిచేయాలి. ఇలా ఎంసీఏ చదువుతూనే.. ఏకకాలంలో కోర్సుకు అనుబంధంగా వ్యాల్యూ యాడెడ్ కోర్సులను కూడా అభ్యసించాలి.

ఇలా చేస్తే ఎంసీఏ పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీగా మారేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. ఇక.. చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలి. లైవ్ ప్రాజెక్ట్స్‌కు అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా క్రేజ్ ఉన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. అంతేకాకుండా నెట్‌వర్క్ అండ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, సి, సి++, జావా నేర్చుకోవాలి.
 
ఇండస్ట్రీ రెడీగా మారాలంటే:
ముఖ్యంగా ఇండస్ట్రీ రెడీగా మారాలనుకునే విద్యార్థికి స్వీయ ఆలోచనా పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు సంబంధించి సరైన దృక్పథం ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి.
  ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, అల్గారిథమ్స్‌పై పట్టు: వీటి వల్ల ఐటీ ప్రాబ్లం సాల్వింగ్‌లో క్రియేటివిటీకి ఆస్కారం లభిస్తుంది.
తాజా ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్‌పై చక్కటి అవగాహన పొందాలి. రియల్ లైఫ్ టెక్నాలజీస్‌తో మమేకమైన ఒక పూర్తి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్‌ను పరిశీలించాలి.
స్వీయ లెర్నింగ్ టెక్నిక్స్: దీనికి చక్కటి సాధనం ఇంటర్నెట్.
కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకోవడం.
క్రిటికల్, లాజికల్ థింకింగ్.
రిపోర్ట్ రైటింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ స్కిల్స్.
 
ఎలక్టివ్స్:
ప్రస్తుతం కరిక్యులం ప్రకారం ఎంసీఏ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఎలక్టివ్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ఎంతో కీలకం. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మొబైల్ కంప్యూటింగ్, రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, వెబ్ 2.0., డేటా ఎనాలిసిస్, బిగ్ డేటా వంటి అంశాలు మంచి ఎలక్టివ్స్‌గా ఉంటున్నారుు. వీటికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ఔపోసన పట్టాలి. లైబ్రరీ సదుపాయూన్ని వినియోగించుకోవాలి. జర్నల్స్, రీసె ర్చ్ పేపర్లను పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది.
 
కోర్సు పూర్తయ్యాక:
ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్‌లు అంతర్భాగమయ్యాయి. చక్కటి సబ్జెక్ట్ పరిజ్ఞానం పొంది కోర్సు పూర్తి చేస్తే నెట్‌వర్క్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు, కోడింగ్, టెస్టింగ్, ఈఆర్‌పీ సొల్యూషన్స్, వెబ్‌డిజైనింగ్, యానిమేషన్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో టీమ్ మెంబర్‌గా అడుగుపెట్టొచ్చు. వివిధ విభాగాల్లో మరెన్నో అవకాశాలున్నాయి.
 
ఎంబీఏ.. ఆ రెండు లక్షణాలు ముఖ్యం
ఎంబీఏలో చేరాలనుకునే విద్యార్థులకు ఆవశ్యకమైన సహజ లక్షణాలు డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. భవిష్యత్తులో కెరీర్ పరంగా మేనేజీరియల్ హోదాల్లో పని చేసే సమయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎంబీఏ ఔత్సాహిక విద్యార్థులకు తప్పనిసరి. కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ కూడా ఉండాలి. కాలేజ్ ఎంపిక విషయంలో ముందస్తు కసరత్తు ఎంతో లాభిస్తుంది. సదరు కళాశాల చరిత్ర, పూర్వ విద్యార్థులు (అలుమ్ని), ప్లేస్‌మెంట్ రికార్డ్స్, ఫ్యాకల్టీ వంటి వాటిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఒకసారి కోర్సులో అడుగు పెట్టాక అనుక్షణం తాము కోర్సులో చేరిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ అకడమిక్‌గా రాణించేందుకు కృషి చేయాలి.

ఎంబీఏ అంటే పుస్తకాల అధ్యయనంతో పూర్తి చేయొచ్చు అనే భావన సరికాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం పలు కేస్ స్టడీల విశ్లేషణ, ఇండస్ట్రీ విజిట్స్ వంటి వాటికి ఉపక్రమించాలి. గ్రామీణ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థులు ఫ్యాకల్టీపైనే ఆధారపడకుండా స్వీయ అధ్యయనాన్ని అలవర్చుకోవాలి. ఇంటర్నెట్ ఆధారంగా.. ఆయా మేనేజ్‌మెంట్ జర్నల్స్, కేస్ స్టడీస్ ఎనాలిసిస్‌లను ఔపోసన పట్టాలి.

ఎంబీఏ స్పెషలైజేషన్ విషయంలోనూ ముందు నుంచే స్పష్టమైన అవగాహనతో కదలాలి. ప్రస్తుతం ఎన్నో కళాశాలలు డ్యూయల్ స్పెషలైజేషన్ అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రథమ స్పెషలైజేషన్‌గా ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. కోర్సు స్వరూపం, స్పెషలైజేషన్ వంటి అంశాల్లో స్పష్టత లభించాక.. నిరంతరం ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన ఏర్పరచుకోవాలి. నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకుంటూ చదవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి.
 - ప్రొఫెసర్ వి. శేఖర్,ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్
 
టెక్నికల్, ఎనలిటికల్ స్కిల్స్ ఉంటే ఎంసీఏ
మ్యాథమెటికల్, టెక్నికల్, ఎనలిటికల్, అప్లికేషన్ స్కిల్స్.. ఈ మూడు లక్షణాలు అవసరమైన కోర్సు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. విద్యార్థులకు ప్రాథమికంగా అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రతి అంశాన్ని.. దాని లక్ష్యం..  ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగ పడుతుంది.. అందుకు అందుబాటులో ఉన్న మార్గాల ను గుర్తించాలి. కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా కోర్సులో చక్కటి ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది ఎంసీఏ విద్యార్థులు కోర్సు స్వరూపం దృష్టితోనే ఆలోచించి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ నైపుణ్యాలు పెంచుకునేందుకే పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అలవర్చుకునేందుకు కూడా కృషి చేయాలి. మూడేళ్ల కోర్సు ప్రాక్టికల్స్‌కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.

ఐటీ రంగంలో సగటున ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఒక కొత్త ప్రోగ్రామ్ ఆవిష్కరణ జరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌పైనా అవగాహన పొందాలి. ఇందుకోసం ఇంటర్నెట్‌ను ముఖ్య సాధనంగా వినియోగించుకోవాలి. షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. దీంతో పాటు కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్స్, మినీ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ వర్క్‌ల విషయంలోనూ లైవ్ ప్రాజెక్ట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఫలితంగా సర్టిఫికెట్ లభించేనాటికి ఆల్ రౌండ్ స్కిల్స్ సొంతం చేసుకోగలుగుతారు.
 - ప్రొఫెసర్ అరుణ్ కె. పూజారి,డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
 
కళాశాల ఎంపిక
ఎంబీఏ/ఎంసీఏ ఔత్సాహిక విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవి..
కళాశాల ఏర్పాటు, ఫ్యాకల్టీ అర్హతలు.. అంటే కళాశాల ఏర్పాటు చేసి చాలా కాలమైందా.. లేదా ఇటీవలనే స్థాపించారా? ఫ్యాకల్టీ పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యనభ్య సించారా? లేదా? బోధనలో వారి ప్రతిభ ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఎందు కంటే.. నేడు చాలా కళాశాలలు తక్కువ అర్హతలున్నవారితోనే తరగతులు నిర్వహి స్తున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన కళాశాల ఎంపిక చాలా ముఖ్యం.
అధునాతన లేబొరేటరీ సదుపాయాలు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, క్రీడా మైదా నం, విశాలమైన తరగతి గదులు అందు బాటులో ఉన్నాయో, లేదో పరిశీలించాలి.
స్టార్టప్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో వీటికున్న  అవకాశాలు.. ఇంక్యుబేషన్ సెంటర్లు వివరా లు తెలుసుకోవాలి.
ఆ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో ఎవరైనా జాతీయస్థాయి పోటీ పరీక్షలైన క్యాట్/గేట్/సివిల్స్ వంటివాటిలో విజయం సాధించారా అనే విషయాన్ని ఆరా తీయాలి.
పాఠ్యేతర కార్యక్రమాలకు(సెమినార్లు, క్రీడ లు, కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ ఓరియెంటెడ్ క్లబ్బులు మొదలైనవి) పెద్దపీట వేస్తున్నా రా? లేదో కనుక్కోవాలి.
గత ఐదేళ్లలో ఆ కళాశాల ప్లేస్‌మెంట్స్ వివరాలు (సంబంధిత కంపెనీల్లో ఎంత పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థు లు ఎంపికయ్యారో తెలుసుకోవాలి)
ఆ కళాశాలకు సంబంధిత సంస్థల (ఏఐసీటీఈ, ఎన్‌బీఏ, యూజీసీ వంటి) గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలి.
  సంబంధిత కళాశాలలు ఎంటర్‌ప్రెన్యూర్‌‌స, టెక్నాలజీ నిపుణులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో గెస్ట్ లెక్చర్‌‌స నిర్వహిస్తాయో, లేదో ఆరా తీయాలి.
ఇప్పుడు చాలా కళాశాలలు బిజినెస్ ఇంక్యుబేషన్లు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా యి. తద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చేయూతనిస్తున్నాయి. ఇలాంటివాటిలో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.
కొన్ని కళాశాలలు ఇంటర్‌‌నషిప్, ప్రాజెక్టు వర్‌‌కలను నామమాత్రంగా నిర్వహిస్తాయి. ఇలాంటి కళాశాలలను ఎంచుకోకూడదు.
కొన్ని కళాశాలలు సీట్ల భర్తీ కోసం ఉచిత ఫీజు అని, ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని బురిడీ కొట్టిస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటాయి. వీరి మాటల వలలో పడకూడదు.
యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలలు, వేళ్ల సంఖ్యలో లెక్కపెట్టగల కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తు న్నాయి. అలాంటి కళాశాలల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మంచి కళాశాల ఏదో అవగతమవుతుంది. అదేవిధంగా సంబంధిత కళాశాల వెబ్‌సైట్ లో కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆ కళాశాల పూర్వ విద్యార్థులతో నూ, ఫ్యాకల్టీతోనూ మాట్లాడి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.
 
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సీట్ అలాట్‌మెంట్ తేదీ: 26.09.2014
వెబ్‌సైట్: https://icet.nic.in/
 కావాల్సిన సర్టిఫికెట్లు
ఐసెట్-2014 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్
డిగ్రీ మార్క్స్ మెమో/ప్రొవిజినల్ సర్టిఫికెట్
ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమో
టెన్త్ క్లాస్ మార్కుల సర్టిఫికెట్
తొమ్మిదో తరగతి నుంచి డి గ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్స్
జనవరి 1, 2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రాలు
స్పెషల్ కేటగిరీ(వికలాంగ అభ్యర్థులు, సాయుధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్) అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. వీరు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌కు తమకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలి.
ఎస్టీ విద్యార్థులు వారికి నిర్దేశించిన హెల్ప్‌లైన్ సెంటర్లలో మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలు.. రెండు సెట్లు

>
మరిన్ని వార్తలు