పరలోకాహారం కోసం ప్రార్థించాలి!

13 Feb, 2014 23:27 IST|Sakshi

ఆహార కొరతకు, ఆకలి చావులకు కేంద్రంగా ఉండేది పాలస్తీనా (ఇప్పటి ఇజ్రాయేల్). తమ ఆహార సమస్యకు, ఆకలి చావులకు పరిష్కారంగా భావించి వేలాదిమంది యేసు ఎక్కడుంటే అక్కడకు వచ్చేవారు. బాధలు, రోగాలు, తాత్కాలిక సమస్యలకు పరిష్కారంగా తనని ఆశ్రయించే వారిని మందలిస్తూ... క్షయమైన వాటికోసం కాదు, అక్షయమైన వాటికోసం తాపత్రయపడాలని ఉద్బోధించాడు ప్రభువు.

భూలోక సంబంధమైన ఆహారం కాకుండా జీవాహారమైన ప్రభువు విశ్వాసి జీవితంలో భాగం కావడం ఎంత ఆశీర్వాదకరమో కదా! ఆ జీవాహారం సమృద్ధిగా అందుబాటులో ఉండగా క్షయమైన లోకావసరాలను మాత్రమే లక్ష్యపెడుతూ, పరలోకపు ఈవులను, విలువలను నిర్లక్ష్యం చేయడం నిజంగా దురదృష్టకరం.

ప్రపంచంలో మరే ప్రాణికీ లేనివిధంగా మనిషి మూలాలు దేవునిలో ఉన్నాయి. అంతిమంగా దైవప్రసన్నతను, సాన్నిధ్యాన్ని అనుభవించడంలోనే మనిషి నిజమైన శాంతిని, జీవన సంతృప్తిని పొందుతాడు. లోకం ఇవ్వగలిగిన వాటికోసం కాదు... దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన నిత్యజీవం కోసం ఆయన్ని ఆశ్రయించే క్రమశిక్షణను మనిషి పెంపొందించుకోవాలి.        

- టి.ఎ.ప్రభుకిరణ్
 

మరిన్ని వార్తలు