ఏ హ్యాండయినా ఓకే..!

5 Nov, 2017 02:10 IST|Sakshi

సాక్షి : ప్రపంచ వ్యాప్తంగా రెండు చేతులతో రాయగలిగే వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ ఒక్క శాతంలో చాలామంది మనదేశంలోని ఓగ్రామంలో ఉన్నారంటే నమ్మగలమా? మధ్యప్రదేశ్‌ సింగ్రాలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోవీపీ శర్మ అనే వ్యక్తి 1999లో వీణా వందిని పాఠశాలను ప్రారంభించాడు.

ప్రస్తుతం స్కూలులో సుమారు 300 మంది విద్యార్థులు రెండు చేతులతో రాయగలుగుతున్నారంట! ‘ఒక మేగజైన్‌లో భారతతొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ రెండు చేతులతో రాయగలరని చదివాను. ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని నేనూ అలా రాయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత విద్యార్థులకు రెండు చేతులతో రాయడం శిక్షణ ఇచ్చాను. మూడో తరగతికి వచ్చేసరికల్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు రెండు చేతులతో రాయగలిగేవారు. ఏడు, ఎనిమిదో తరగతులకు వచ్చేసరికి ఎలాంటి తడబాటు లేకుండా వేగంగా రాస్తున్నారు. దీంతోపాటు మా స్కూలువిద్యార్థులకు ఉర్దూతో పాటు పలు భాషలు తెలుసు’అని శర్మ చెప్పుకొచ్చారు.

ప్రతి 45 నిమిషాల క్లాసులో 15 నిమిషాలపాటు రెండు చేతులతో రాయడంపై ప్రాక్టీస్‌ చేయిస్తామని చెప్పారు. వివిధ భాషలు తెలిసిన వారిలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుందని శర్మ విపరీతంగా నమ్ముతారు. అందుకే రెండు చేతులతో రాసే సమయంలో వివిధ భాషల్లో రాయమని విద్యార్థులకు సూచిస్తారు. దీనిద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. కానీ రెండు చేతులతో రాయడం ఎంతో హానికరమని ఇటీవలకొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వార్తలు