చేజ్ చేసి పట్టుకున్నాం...

10 May, 2015 01:01 IST|Sakshi
చేజ్ చేసి పట్టుకున్నాం...

బెస్ట్‌కేస్
అపాయంలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినప్పుడు తన కళ్లలోని ఆనందం కంటే అతని తల్లి తెలిపే కృతజ్ఞత ఎలాంటివారి హృదయాన్నైనా కదిలిస్తుంది. 2004 లో విజయనగరం ఎస్‌పీగా పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ కేసు దర్యాప్తు సంగతి అలా ఉంచితే కన్నకొడుకుని ప్రాణాలతో ఆమెకు అప్పగించినపుడు ఆ తల్లికార్చిన ఆనందబాష్పాలు నా కళ్లను కూడా తడిపాయి. ఒకరోజు పొద్దున పదకొండు గంటలకు ఒరిస్సా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది.

విజయనగరం -ఒరిస్సా సరిహద్దులో ఓ కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్‌కి గురైంది ఒరిస్సాకి చెందిన ఓ నగలవ్యాపారి కుమారుడు. వయసు 22 ఉంటుంది. కిడ్నాపర్లు విజయనగరానికి చెందినవాళ్లు.
 
బ్లాక్‌మెయిల్...
ఒకపక్క వ్యాపారి కొడుకుని క్షేమంగా అప్పగించాలంటే మాకు పెద్దమొత్తంలో డబ్బు కావాలంటూ బ్లాక్‌మెయిల్ కాల్స్ వస్తున్నాయి. మరో పక్క మీ పరిధిలో జరిగిన సంఘటన దర్యాప్తు ముమ్మరం చేయండంటూ ఒరిస్సా పోలీసుల ఒత్తిడి. వ్యాపారి ఫొటో పంపించారు. అన్ని చెక్‌పోస్టులకు అనుమానితులను చెక్ చేయమంటూ మెసేజ్  పంపించాను. రోజు గడిచింది గానీ పాజిటివ్ మెసేజ్ రాలేదు.
 
పసిబిడ్డ తండ్రి...
కిడ్నాప్‌కి గురైన వ్యాపారికి ఏడాదిన్నరక్రితం పెళ్లయింది. మూడు నెలల పసి బిడ్డ ఉన్నాడు. బాధితుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. తల్లిదండ్రులు, భార్యా ఆవేదన గురించి చెబుతూ ఒరిస్సా పోలీసులు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు.  
 
ఓ గుడిసెలో...
మా గాలింపుల విషయం తెలుసుకున్న దుండగులు తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒరిస్సా - విజయనగరం సరిహద్దులో హైవేకి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలంలోని గుడిసెలో దాక్కున్నట్టు సమాచారం అందింది. వెంటనే మా వాళ్లు మారువేషాల్లో దుండగులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని కూడా పసిగట్టిన దుండగులు అక్కడి నుంచి సుమోలో పారిపోయారు. ఎటువైపు వెళ్లారో తెలుసుకుని ఆ వైపు ఉన్న అన్ని చెక్‌పోస్టులకు వెహికల్స్‌ని స్ట్రిక్ట్‌గా చెక్ చేయమని చెప్పాను. హైవేలలో నిఘా పెట్టాం.
 
80 కిలోమీటర్లు....
దుండగుల వాహనాన్ని వెంబడిస్తూ దాదాపు ఎనైభై కిలోమీటర్ల దూరం మా టీమ్ వేట సాగింది. ‘రెండు రోజుల్లో మేం చెప్పిన చోటుకు అడిగిన సొమ్ము పంపించకపోతే అక్కడ మీ అబ్బాయి శవం దొరుకుతుంది’ అంటూ దుండగులు వ్యాపారి తండ్రికి చెప్పిన మాట నాకు పదే పదే గుర్తొస్తోంది. ఎట్టకేలకు వంద అడుగుల దూరంలో దుండగుల బండి ఉందనగా సుమోలో నుంచి ఒక దుండగుడు గన్ చూపించాడు. వెంటనే మా వాళ్లు బండి స్పీడు తగ్గించి నాకు ఫోన్ చేశారు. అంటే దానర్థం వెనక్కి వెళ్లిపొమ్మనా, వ్యాపారిని చంపేస్తారనా? అర్థంకాలేదు.  వెంబడించాలా...వెనక్కి రావాలా? అంటూ మావాళ్లు నన్ను అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా నేను చెప్పిన సమాధానం... వెంబడించి దుండగుల్ని పట్టుకోమని. మావాళ్లు స్పీడు పెంచి దుండగుల బండిని ఓవర్‌టేక్ చేశారు. ఎలాంటి ఫైరింగ్ చేయకుండా వాళ్లను పట్టుకున్నారు.
 
ఆ తల్లి కళ్లలో...
సుమో వెనకసీట్లో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వ్యాపారి సురక్షితంగా కనిపించడంతో మావాళ్ల ఆనందానికి అవధుల్లేవు. నేను వెళ్లి అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చినపుడు ‘బతుకుతాననుకోలేదు మేడమ్’ అంటూ చేతులు జోడించాడు. ఇంతలో అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డా అందరూ మా పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నారు. అప్పటికి అతను కిడ్నాప్‌కి గురయ్యి రెండురోజులైంది. ఆ రెండు రోజులూ కూడా తల్లిదండ్రులు, భార్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదట. అందరూ ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ మొహాలతో ఉన్నారు.

వ్యాపారి తల్లి నా చేతులు పట్టుకుని ‘నీ రుణం తీర్చుకోలేను తల్లీ....’ అంటూ ఒరిస్సా భాషలో తన పరిస్థితిని, సంతోషాన్ని పంచుకుంది. వ్యాపారి తన మూడు నెలల బిడ్డని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. ఏ భార్య అయినా ఏం చేస్తుంది? రెప్పార్పకుండా భర్తని కంటినిండా చూసుకుంది. ఇంతలో వెంట తెచ్చుకున్న ఆహారమేదో బిడ్డకు తినిపించిందా తల్లి.
ప్రెజెంటేషన్: భువనేశ్వరి

మరిన్ని వార్తలు