తల్లిని చంపి.. కూతురిపై లైంగిక దాడి

19 Apr, 2016 11:57 IST|Sakshi

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను దారుణంగా హత్య చేయడమే కాకుండా.. ఆమె కుమార్తెను లాడ్జిలో నిర్బంధించి లైంగిక దాడికి దిగిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన మాభున్ని(40) అనే మహిళకు అనంతపురం పట్టణానికి చెందిన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది.



మాభున్నికి ఇంటర్, టెన్త్ చదివే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాభున్ని కుటుంబాన్ని అనంతపురంలోని శారదానగర్‌లో ఒక ఇంట్లో ఉంచి రామకృష్ణ పోషించేవాడు. పది రోజుల క్రితం కుటుంబాన్ని అశోక్‌నగర్‌కు మార్చాడు. మాభున్ని పెద్ద కూతురిపై కన్నేసిన రామకృష్ణ గత గురువారం మాభున్నిని ఇంట్లోనే కిరాతకంగా హతమార్చి ఇద్దరు పిల్లలను తీసుకుని హిందూపురం వెళ్లాడు. అక్కడ లాడ్జిలో పెద్ద అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.


ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లాడ్జిపై దాడిచేసిన పోలీసులు రామకృష్ణను అరెస్టుచేసి యువతిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రెండో అమ్మాయి ఏమైందో ఆచూకి తెలియలేదు. హిందూపురం పోలీసులు కేసు నమోదుచేసి విచారించగా అనంతపురం అశోక్‌నగర్‌లో మాభున్నిని తానే హతమార్చానని నిందితుడు అంగీకరించాడు.

 

ఈ నేపధ్యంలో మూడు రోజుల క్రితం అనంతపురంలో మాభున్ని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు కేసులను సమన్వయం చేసుకుని విచారణ చేసేందుకు హిందూపురం పోలీసులు మంగళవారం అనంతపురం వచ్చారు. రెండో బాలిక ఏమైందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై రామకృష్ణ సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు