త్రినేత్రం

20 Sep, 2015 00:54 IST|Sakshi
త్రినేత్రం

‘వెహికల్ మౌంట్ కెమెరాల’తో నేరాలకు చెక్
గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేకంగా ఐదు వాహనాలు
ట్యాంక్‌బండ్‌పై పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్
సాక్షి, సిటీబ్యూరో:
నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న నగర పోలీసులు మరో ముందడుగు వేశారు. ‘వెహికల్ మౌంట్ కెమెరాల’తో నేరాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం ఐదు వెహికల్ మౌంట్ కెమెరాలు సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో ఉన్న 20 కెమెరాలు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్ పింట్ జూమ్‌తో పాటు 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ పని చేసే ఈ కెమెరాలు అన్ని దృశ్యాలను ‘కవర్’ చేస్తాయి. వాహనానికి పక్కకు, వెనుకకు కూడా ఒక్కో కెమెరా ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల పరిధిలో తన పనితనాన్ని ‘చూపిస్తుంది’. లోపల ఉన్న స్క్రీన్ పై వీటిని చూసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆన్‌లైన్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించవచ్చు. వీటిలోని దృశ్యాలు 15 రోజుల పాటు నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఉంది.

ఇలా పర్యవేక్షించడం వల్ల అప్రమత్తమై... గొడవలు, ఘర్షణలను నిరోధించవచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో  ఈ వాహనాలతో పెట్రోలింగ్ వల్ల నేరాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ‘దశల వారీగా నగరంలో ఉన్న 120 వాహనాలకు వంటెడ్ కెమెరాలను అవుర్చి నేరాలు అదుపు చేస్తాం. ఇప్పటికే బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు గణనాథులు నిమజ్జనానికి వచ్చే మార్గంలో నాలుగు వందలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. వీటన్నింటిని సీపీ కార్యాయలంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించాం.

ఆధునిక సాంకేతికతతో ఎక్కడ ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పర్యవేక్షి స్తున్నామ’ని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌కంట్రోల్ రూమ్‌తో పాటు ఐదు వెహికల్ మౌంట్ కెమెరాలను శనివారం ఆయన ప్రారంభించారు. జోన్‌కు ఒకటి చొప్పున వాహనాలను కేటాయించామన్నారు. జోన్‌ల డీసీపీలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ వాహనాలు నడిపేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు.  ఈ కార్యక్రమంలో నగర శాంతి భద్రతల అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు