హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారంలో సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయీం ఎలాంటి బ్యాంక్ ఎకౌంట్ లేకుండా వేలకోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. బంగారం, నగదుతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని నయీం ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది.
నయీం బినామీల పేరిట ఇప్పటివరకు 1015 ఎకరాల భూమి, లక్షా 67 వేల 117 చదరపు గజాల ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వీటి విలువ 14.39 కోట్లు రూపాయలు కాగా, బహిరంగ మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నారు.