సాక్షి, హైదరాబాద్: టీవీ ఆర్టిస్టును నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసిన నిందితున్ని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని ధర్మవరం ఎస్బీకాలనీకి చెందిన కొమ్మారశెట్టి గిరీశ్ (27) అనంతపురంలోని ఓ మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్లో ఉండే ఓ సినిమా ఆర్టిస్టు (34)తో కామన్ ఫ్రెండ్ ద్వారా గిరీశ్కు పరిచయం ఏర్పడింది. తన అవసరానికి రూ.లక్ష కావాలని ఆమె గిరీశ్ని కోరడంతో, డబ్బు తీసుకోడానికి అనంతపురం రావాలని చెప్పాడు. 2016 నవంబర్లో టీవీ ఆర్టిస్టు అనంతపురం వెళ్లి గిరీశ్ను కలిసింది.
ఈ విషయం మాట్లాడిన అనంతరం కూల్డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అర్ధనగ్న చిత్రాలు, వీడియోలు సెల్ఫోన్లో రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో గది అద్దెకు తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు సైతం తీసుకొని స్థానికంగా ఉన్న బ్యాంక్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ను ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లి గిరీశ్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది.