వర్ష బాధితులను ఆదుకుంటాం

22 May, 2016 02:38 IST|Sakshi
వర్ష బాధితులను ఆదుకుంటాం

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
గాయపడిన వారికి రూ. 50 వేలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

 యాకుత్‌పురా: ఈదురు గాలులు, వర్షం కారణంగా మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందజేసి ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన డిప్యూటీ మేయర్ మహ్మద్ ఫసియుద్దీన్, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఆర్‌డీఓ నిఖిలతో కలిసి ఈదురు గాలుల కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, దేవాలయాన్ని సందర్శించారు.

మొదట గౌలిపురా సుల్తాన్‌షాహి, జగదీష్ హనుమాన్ దేవాలయంలో కూలిన చెట్టును పరిశీలించారు.  అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తలాబ్‌కట్టా జహంగీర్‌నగర్‌లో ఈదురు గాలులకు శుక్రవారం సాయంత్రం సింథటిక్ వాటర్ ట్యాంక్ పడి మృతిచెందిన అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబాన్ని పరామర్శించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసి మృతుడి భార్యకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇదే సంఘటనలో గాయపడిన ఖలీల్ బిన్  ఇబ్రహీం, షరీఫా బేగంలకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. మృతుడి భార్యకు రూ.5 లక్షలు వచ్చేంత వరకు ఖర్చుల నిమిత్తం రూ. 25 వేలను అందజేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-4ఎ,బీ, సర్కిల్-5 బి. కృష్ణశేఖర్, వి.విజయ్ కుమార్, డాక్టర్ ఎన్.యాదగిరిరావు, జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం బయోడైవర్సిటీ అడిషనల్ డెరైక్టర్ అన్నపూర్ణాదేవి, చార్మినార్, బండ్లగూడ మండల తహసీల్దార్లు ఎస్.పి.ఆర్.మల్లేష్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు