పలుచోట్ల మోస్తరుగా కురిసే అవకాశం
కొనసాగుతున్న ఈశాన్య, తూర్పు గాలులు
భారత వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈశాన్య రుతుపవనాలు ఒక మోస్తరు చురుకుదనాన్ని సంతరించుకున్నాయి.
వీటన్నింటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. కాగా, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
నగరి (చిత్తూరు)లో 5.5 సెం.మీ.లు, యలమంచిలి (అనకాపల్లి) 5.2, సత్తెనపల్లి (పల్నాడు) 5.1, ముతుకుల (ప్రకాశం) 4.3, బ్రాహ్మణపల్లి (ఎస్పీఎస్సార్ నెల్లూరు) 4.2, మొగులూరు (ఎన్టీఆర్) 4.1, వడమాలపేట (తిరుపతి) 3.4, చిన్నతిప్పసముద్రం (అన్నమయ్య), పెందుర్తి (విశాఖపట్నం)లో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.