కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్‌

7 Jan, 2018 04:20 IST|Sakshi

హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్‌ మాచి రాజు ప్రదీప్‌ సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం అందించారు.

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అం దించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్‌ శుక్రవారం వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు.   

మరిన్ని వార్తలు