కీచక టీచర్... కటకటాల్లోకి

17 Sep, 2015 18:16 IST|Sakshi
కీచక టీచర్... కటకటాల్లోకి

విద్యార్థినిని కిడ్నాప్ చేసి గుంటూరు ఎత్తుకెళ్లిన మోసగాడు

సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తూ లైంగిక కోరికలు తీర్చుకొనేందుకు ఆ బాలికను కిడ్నాప్ చేసిన కీచక టీచర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం..

కార్మిక నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాము(28) అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)పట్ల ఏడాదిగా కామవాంఛ పెంచుకున్నాడు. ట్యూషన్ పేరుతో ఆ బాలికను తన గదికి రప్పించుకొని తాను ప్రేమిస్తున్నానని తరచూ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. ఆ వీడియోను చిత్రీకరించి భయపెడుతూ ప్రేమించకపోతే చంపేస్తానంటూ హెచ్చరించాడు.

వారం క్రితం గుంటూరు జిల్లా వినుకొండలో రాము భార్య భారతికి ఆసుప్రతిలో సర్జరీకాగా చూడటానికి వెళుతూ విద్యార్థినిని బలవంతంగా తనవెంట తీసుకెళ్లాడు. తాను రానని ఆ బాలిక మొత్తుకున్నా వినకుండా బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు అదేరోజు తమ కూతురు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. టీచర్ రాము ఆ బాలికను గుంటూరు పరిసరప్రాంతాల్లో బంధించి వేధించడం మొదలు పెట్టాడు.

సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలిస్తుండగానే రాము బంధువులు నిఘావేసి బస్సులో బాలికతో కలిసి తిరుగుతున్న రామును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వినుకొండ పోలీసులకు అప్పగించారు. అప్పటికే బాలిక మిస్సింగ్ కేసు జూబ్లీహిల్స్‌లో నమోదు కావడంతో వినుకొండ పోలీసులు నిందితుడిని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్, నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు