శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలి

12 Dec, 2016 14:49 IST|Sakshi
సీఎస్ ప్రదీప్ చంద్రకు టీఎన్‌జీవో నేతల విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కేడర్ స్ట్రెన్‌‌తను నిర్ణయించాలని, ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు టీఎన్‌జీవో నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలో టీఎన్‌జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి కొత్తగా నియమితులైన సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ప్రధాన కేం ద్రంలో పనిచేసే వారికి 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కోరారు.
 
 పీఆర్‌సీ అమలుకు ముందు 9 నెలల గ్యాప్ పీరియడ్‌లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ ఇవ్వలేదని, వెంటనే వారికి గ్రాట్యుటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపట్టాలని, పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, హెల్త్‌కార్డుల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని  ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. 
 
మరిన్ని వార్తలు