ఒపీనియన్... ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

1 Feb, 2016 02:13 IST|Sakshi

సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనున్నందున ఓపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ వంటివి నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార, ప్రసార మాధ్యమాలు ఇలాంటి వాటిని  ప్రచారం... ప్రసారం చేయరాదని పేర్కొంది. ఇవి పోలింగ్‌పై ప్రభావం చూపనున్నందున నిషేధం విధించినట్టు పేర్కొంది. ఇంటర్‌నెట్, రేడియో, టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ, శాటిలైట్, కేబుల్ చానెల్స్, మొబైల్, తదితర ఏ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానూ ప్రసారం చేయడానికి వీల్లేదు. ప్రింట్ మాధ్యమానికి సంబంధించి వార్తాపత్రిక, మేగజైన్, పీరియాడికల్, పోస్టర్, ప్లకార్డు, హ్యాండ్‌బిల్, ఇతరత్రా డాక్యుమెంట్ల రూపేణా ప్రచారం చేయకూడదు.

వీటిని అతిక్రమించే వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్రమంత్రులు ఓటరుగా, లేదా పోటీ చేస్తే అభ్యర్థిగా, అధీకృత ఏజెంటుగా తప్ప ఇతరత్రా అధికారంతో పోలింగ్ కేంద్రాల్లోకి కానీ, ఓటర్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రంలోకి కానీ వెళ్లేందుకు వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెక్యూరిటీ సదుపాయం ఉన్న మంత్రులు ఎన్నికల ఏజెంట్‌గా, పోలింగ్ ఏజెంట్‌గా, కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు వీల్లేదు. భద్ర తా సిబ్బందినీ కేంద్రాల్లోకి అనుమతించరు.
 

మరిన్ని వార్తలు