‘పదేళ్లు’.. మరో రెండేళ్లు

9 Aug, 2017 02:29 IST|Sakshi
‘పదేళ్లు’.. మరో రెండేళ్లు
గరిష్ట వయోపరిమితి సడలింపు మరోసారి పొడిగింపు
 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిరుద్యోగులకు ప్రయోజనంగా ఉండేందుకు మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలైలో ప్రభుత్వం ఈ వయో పరిమితిని సడలించింది. అదనంగా పదేళ్లపాటు గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచింది. ఈ వెసులుబాటు ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. 2016 జూలైలో మరో ఏడాది పొడిగించింది. గతనెలలో ఈ గడువు ముగిసింది. దీంతో తాజాగా మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై 26 వరకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి పొడిగింపు ఉత్తర్వులు అమలు కానున్నాయి. 
మరిన్ని వార్తలు