సంప్రదాయ వేడుక ‘ఛట్’

29 Oct, 2014 00:55 IST|Sakshi
సంప్రదాయ వేడుక ‘ఛట్’

గాజులరామారం:  నగరంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు వారి సంప్రదాయ వేడుక ‘ఛట్’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, అస్సాం, బెంగాలీలతో పాటు నేపాల్‌లో కూడా ఈ వేడుక జరుపుకుంటారు.
 బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు తమ పండుగల్లో ప్రధాన పండుగగా కుటుంబ సంక్షేమంతో పాటు భగవంతుడికి కృతజ్ఞతగా ఈ వేడుక జరుపుకుంటారు. బుధవారం నుంచి ఈ వేడుక జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సూర్య భగవానుడికి ప్రసాదం

కార్తీక మాసంలో ఆరో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతికి సంబంధించిన పూజ. సూర్య భగవానుడిని పూజిస్తారు. మోకాలి లోతు నీటిలో నిలబడి సూర్యుడికి ప్రసాదాలను సమర్పించడం ఈ వేడుక విశిష్టత. వెదురు చాటలో పూలు, పళ్లు ఉంచి నదిలో వదిలిపెట్టి ప్రకృతికి నైవేద్యంగా సమర్పిస్తారు.

పూజా విధానం...

ఛట్ పూజలు ప్రధానంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఇష్టమైన వారు ఈ పూజ చేసుకోవచ్చు. వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాస దీక్షతో పాటు తీసుకునే ఆహారంలో నియమాలు పాటిస్తారు. మొదటి రోజును సహాయ్ కాయ్, రెండో రోజును ఖర్న, మూడోరోజును పేహలా ఆర్గ్య్, నాల్గో రోజును పార్నాగా వ్యవహరిస్తారు. మూడు, నాలుగో రోజు నది వద్ద పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం పంచుతారు.  

పూజతో లాభాలు...

హిందూ పురాణాలు, ఆచారాల ప్రకారం ఛట్ పూజలతో భగవంతుని ఆశీస్సులు లభిస్తాయనేది నమ్మకం. వ్రతంలో ఆచరించే పద్ధతులతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, సూర్యోదయం, సంధ్యా సమయంలో నదిలో స్నానం ఆచరించడం వల్ల చర్మ సంబంధిత బాధలు తొలగిపోతాయి.

చారిత్రక కథనం

వ్రతానికి సంబంధించి పురాణాల్లో అనేక కథనాలున్నాయి. పూర్వం ప్రియాబ్రత్ అనే రాజుకు సంతానం లేకపోతే కశ్యప మహర్షి ఆశీస్సులతో యజ్ఞం చేయగా రాజు భార్య మాలినికి మృత శిశువు జన్మించడంతో ఆత్మహత్యకు సిద్ధమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఛట్ వ్రతం ఆచరించమంటాడు. రాజు వ్రతాన్ని ఆచరించి తిరిగి సంతానం పొందాడు అనేది కథనం. ద్వాపర యుగంలో పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కురుక్షేత్రంలో గెలుపొందారనేది మరో కథనం.
 
 

>
మరిన్ని వార్తలు