తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య

29 Oct, 2014 10:31 IST|Sakshi
తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య

వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్‌చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఫరీదా తల్లి ఆజీ బేగం మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటోంది. అల్లుడు, కూతురు ఈమె వద్దే ఉంటున్నారు. గౌస్ జులాయిగా తిరిగేవాడు. మద్యం, గంజాయి తాగుతూ మైకంలో తరచు భార్యతో గొడవ పడేవాడు. భార్య, అత్తను చంపుతానని మూడు రోజులుగా జేబులో బ్లేడ్ పెట్టుకొని తిరుగుతున్నాడు.

సోమవారం అర్ధరాత్రి గంజాయి తాగిన గౌస్ తన కుమారుడు జాఫర్ (8 నెలలు)ను చంపడానికి ప్రయత్నించగా భార్య ఫరీదా వారించింది. దాంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న అత్త గౌస్‌ను మందలించింది. మద్యం మత్తులో ఉన్న గౌస్ అత్త ముక్కును కొరికేశాడు. అతడు తమను చంపేస్తాడని భావించిన ఫరీదా, ఆజీ బేగం కలిసి గౌస్ బేబులోని బ్లేడ్ తీసుకొని.. అతడి గొంతునే కోసేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఫరీదా, ఆజీ బేగం మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. గౌస్‌ను చంపేశామని చెప్పి లొంగిపోయారు. గౌస్‌తో జరిగిన పెనుగులాటలో ఆజీ బేగంకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు